బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏనాడు ఏమీ చేయని, కనీసం ఈ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ – నారాపల్లి ఫ్లైఓవర్ని కూడా పూర్తి చేయలేకపోయిన బీజేపీకి ఓటేయాలా.. లేక గత ఎన్నికల్లో గెలిపించినప్పటికి.. ఒక్కరోజు కూడా లోక్సభలో మల్కాజిగిరి సమస్యల గురించి ప్రస్తావించని కాంగ్రెస్ పార్టీకి మద్దతియ్యలా లేక మల్కాజ్గిరి పార్లమెంట్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడి.. ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తకు ఎంపీగా అవకాశమిచ్చిన బీఆర్ఎస్ పార్టీని బలపరచాలా.. మల్కాజ్గిరి ఓటర్లు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని పిలుపునిచ్చారు.
మన బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేసి, దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాగిడి లక్ష్మారెడ్డి గారు.. తన తల్లి గారి పేరు మీద మధుర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 50 వేల మందికి పైగా సేవలందించారు అని కొనియాడారు.
కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి అనే ఒక సామాన్య నాయకుడు ఇద్దరు రాజకీయంగా సీనియర్ నాయకులపై పోటీకి దిగారు. బీజేపీ నుండి ఈటెల రాజేందర్ ఒక వైపు, కాంగ్రెస్ నుండి పట్నం సునీతా రెడ్డి మరో వైపు.. వీళ్ళు ఇద్దరూ మల్కాజ్గిరికి చేసిందేమీ లేదు.. చేసేదేమి లేదు. వారిద్దరికి అధికార దాహం తప్ప మరొకటి లేదు అని దుయ్యబట్టారు.
లక్ష్మారెడ్డి గెలిస్తే ఒక సామాన్యుడి గొంతు లోక్సభలో వినబడుతుంది. మన మల్కాజ్గిరి అభివృద్ధి పథాన నిలుస్తుంది. రాగిడి లక్ష్మారెడ్డి గారి గళం.. మల్కాజ్గిరికి బలం అని పేర్కొన్నారు.