mt_logo

రేవంత్ రెడ్డి ఛలో ఢిల్లీ కాదు ఛలో పల్లె చేపట్టాలి: కేటీఆర్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డికు దమ్ముంటే ఛలో ఢిల్లీ కాదు ఛలో పల్లె చేపట్టాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతుంటే.. వారివైపు కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రలా అని మండిపడ్డారు.

ఒకటి కాదు.. రెండుకాదు.. ఎనిమిది నెలల్లో..ఏకంగా 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారా.. రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా అని అడిగారు. ఎన్నికల్లో అన్ని గాలి మాటలు చెప్పారు.. గద్దెనెక్కగానే గాలిమోటర్లలో ఊరేగుతున్నారు. మీ యాత్రలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటి అని ప్రశ్నించారు.

అన్నదాతలను ఆగంచేసి.. దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు.. రుణమాఫీ పూర్తిచేసెదెవరు. అధిష్టానం మెప్పు కోసం పగలూ రాత్రి తపన తప్ప.. అన్నం పెట్టే రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని కేటీఆర్ దుయ్యబట్టారు.

రైతులకేమో మాయమాటలు.. ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలా? 20 సార్లు చేపట్టిన ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు దక్కింది గుండుసున్నా. ఓవైపు డెంగీ మరణాలు.. మరోవైపు పెరుగుతున్న నేరాలు.. ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు.. గాడితప్పిన పాలనతో.. రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది ఢిల్లీలో కాదు తెలంగాణ గల్లీల్లో అని చురకలు అంటించారు.

రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. అన్నదాతలను అరిగోస పెట్టి.. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రతిక్షణం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదోరోజు కుర్చీ లాగేయడం తథ్యం అని కేటీఆర్ పేర్కొన్నారు.