mt_logo

రాజ్యాంగం ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోంది: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్ బీజేపీ కనుసన్నులో నడుస్తోంది.. మేము స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నాం. జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దారుణంగా వ్యాఖ్యలు చేసిన సరే వారిపై చర్యల్లేవ్ అని పేర్కొన్నారు.

బీజేపీ సోషల్ మీడియాలో ముస్లింలపై డైరెక్ట్‌గా విషం చిమ్ముతూ పోస్ట్‌లు చేస్తున్నారు. మోడీ గారు డైరెక్ట్‌గా ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దాదాపు 20 వేల కంప్లైంట్స్ వచ్చాయి.. కనీసం మోడీ గారికి నోటీసులు కూడా ఇవ్వలేదు. మోడీకి భయపడి బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారికి ఈసీ నోటీసులు ఇచ్చింది అని దుయ్యబట్టారు.

ఎన్నికల్లో అమిత్ షా దేవుడి ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తే ఆయనపై చర్యల్లేవ్. బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో రాముడి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. ప్రధాని మోడీ విద్వేష వ్యాఖ్యలు చేసినా.. అమిత్ షా దేవుని ఫోటోలు పెట్టుకొని ఓట్లు అడిగిన ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోదు.. కానీ కేసీఆర్ గారి విషయంలో మాత్రం.. ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారు అని ధ్వజమెత్తారు.

సిరిసిల్లలో జరిగిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ గారు కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వటం లేదని నేతన్నలు ఆవేదనతో చెబితే కేసీఆర్ గారు దానిపై స్పందించారు. నిరోధ్‌లు, పాపాడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే దాన్ని ఖండిస్తూ కొంచెం కఠిన పదం వాడారు.. దీనిపై అయితే చర్యలు తీసుకున్నారు.. మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డిపై మేము ఎన్ని ఫిర్యాదులు చేసిన ఈసీ పట్టించుకోలేదు.. తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి చాలా అద్వానంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నీతి సూక్తులు, ప్రవచనాలు, సుభాషితాలా? రేవంత్ రెడ్డి మీద 8 సహా మొత్తం 27 కంప్లైంట్లు చేశాం.. ఒక్క దానిపై యాక్షన్ లేదు. ఒక్క మంత్రి కొండా సురేఖ గారిని మందలించారంతే అని అన్నారు.

కేసీఆర్ గారి సభలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టింది.. చోటా భాయ్, బడా భాయ్ మోసాలను రోడ్ షోలలో కేసీఆర్ గారు ప్రజలకు పూస గుచ్చినట్లు వివరించారు. కేసీఆర్ గారి సభలకు వస్తున్న స్పందన, 12 సీట్లు బీఆర్ఎస్‌కు రావచ్చునని సర్వే రిపోర్టులు చూసి బడే భాయ్, చోట భాయ్ భయపడ్డారు.. ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు ఓటు ద్వారానే జవాబు చెప్పాలని ప్రజలను కోరుతున్నా అని పిలుపునిచ్చారు.

ఎన్నిసార్లు మేము ఈసీకి ఫిర్యాదు చేసిన గోడకు చెప్పుకున్నట్లే ఉంది. మోడీ, నడ్డా, రేవంత్ రెడ్డిలకు నోటీసులు ఇవ్వటానికి ఈసీ ఎందుకు భయపడుతోంది. కేసీఆర్‌పై ఫిర్యాదు వస్తే మాత్రం ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణులు, బూతులు ఉన్నాయి.. అయిన పట్టించుకోవటం లేదు.. రాజ్యాంగం ఇచ్చిన స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోంది అని వ్యాఖ్యానించారు.

నా మాటలు తప్పు అయితే మోడీకి నోటీసులు ఎందుకు ఇవ్వటం లేదో చెప్పాలె. ఈసీ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్‌గా నిర్వహిస్తామని మాటలకే పరిమితమైంది.. మేము ప్రచారం చేయటాన్ని అడ్డుకొని మా ప్రత్యర్థులను మాత్రం అచ్చొసిన అంబోతులను వదిలేసినట్లు వదిలేశారు అని కేటీఆర్ పేర్కొన్నారు.