mt_logo

చేతిలో రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు: కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై కేటీఆర్ ధ్వజం

బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులతో కలిసి ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ కాంగ్రెస్ పెద్ద పెద్ద మాటలు చెబుతోంది. కానీ అదే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా కాంగ్రెస్ నయవంచనకు పాల్పడుతోంది అని దుయ్యబట్టారు.

1967 లో హర్యానాలో గయాలాల్ అనే వ్యక్తి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి ఆయన పేరు మీదే ఆయారాం, గయారాం అనే సంస్కృతి వచ్చింది. ఈ ఆయారాం, గయారాం కల్చర్‌ను అదే విధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రెండింటిని కాంగ్రెస్ పార్టీయే తెచ్చింది అని గుర్తు చేశారు.

2014 కు ముందు కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కానీ తెలంగాణకు ఆ పార్టీ అన్యాయం చేసింది. కాంగ్రెస్ చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అద్భుతంగా అభివృద్ధి చేశారు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోనే మేము ఓటమి పాలయ్యాం అని అన్నారు.

కాంగ్రెస్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో ఎన్నో హామీలు ఇచ్చింది. ఈస్ట్‌మన్ కలర్ సినిమా చూపించి చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. స్వయంగా రాహుల్ గాంధీ గారే తెలంగాణకు వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతకు హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.. గెలిచిన మరుసటి రోజే రూ. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 7 నెలలు గడిచినప్పటికీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ మర్చిపోయింది. కానీ మా ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఎవరైతే రాజ్యాంగానికి మేము రక్షకులమని చెబుతున్నారో వాళ్లే ద్వంద్వ విధానాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ వైఖరి ఏ విధంగా ఉంటుందో దేశానికి తెలియజేసేందుకే ఢిల్లీకి వచ్చి మాట్లాడుతున్నాం అని కేటీఆర్ తెలిపారు.

ఇదే రాహుల్ గాంధీ గారు 2022 లో గోవాలో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉండాలని వాళ్లతో ప్రమాణం చేయించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ వాళ్లు రూ. 50 కోట్లు ఇచ్చి మా ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కూడా మా ఎమ్మెల్యేలను తీసుకునేందుకు సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారని ఆరోపిస్తారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళితే ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని పోరాటం చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలోకి తీసుకుంటారు అని విమర్శించారు.

మణిపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే దానికి కాంగ్రెస్ న్యాయపోరాటం చేసింది. అప్పుడే సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ కీలకమైన తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా తేల్చి చెప్పింది. హిమాచల్ లోనూ ఒక రాజ్యసభ సభ్యుడి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. గోవా, కర్ణాటక, మహరాష్ట్ర, హర్యానాలో పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ వాళ్లు శోకాలు పెడతారు. అదే తెలంగాణలో ఏఐసీసీ అనుమతి తీసుకొని మరీ రేవంత్ రెడ్డి మా పార్టీ నాయకులను వాళ్ల పార్టీలో చేర్చుకుంటారు అని ధ్వజమెత్తారు.

ఇదెక్కడి నీతి? ఒక వైపు రాజ్యాంగాన్ని రక్షించే వాళ్లముంటూనే.. మరోవైపు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. పార్టీ మారిన వాళ్లు పిచ్చి కుక్కలతో సమానమని రేవంత్ రెడ్డి అన్నారు. మరి రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా ఎవరు పిచ్చి కుక్క? ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలి? అని కేటీఆర్ అడిగారు.

కర్ణాటకలో బీజేపీ మీ ఎమ్మెల్యేలను రూ. 50 కోట్లు ఇచ్చి కొంటే మీరు తెలంగాణలో వంద కోట్లు ఇచ్చి కొన్నారా? రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలె. రాహుల్ గాంధీ గారు ద్వంద్వ విధానాలను పాటిస్తామంటే అది కుదరదు. మీ విధానాలను ఢిల్లీ స్థాయిలో దేశ ప్రజలకు తెలిసేలా చేస్తాం. బహిరంగంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. దీనిపై విచారణ కూడా పెద్దగా అవసరం లేదు అని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ సీటు మీద గెలిచిన దానం నాగేందర్ అనే ఎమ్మెల్యే.. కాంగ్రెస్ బీ ఫాంతో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నీతి లేని వ్యవహారంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. రాజ్యాంగ పరిరక్షకులైన రాష్ట్రపతి గారిని కలిసి ఫిర్యాదు చేస్తాం. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి కాంగ్రెస్ విధానాలపై ఫిర్యాదు చేస్తాం. కాంగ్రెస్, బీజేపీ బాధితులైన పార్టీలతో కలిసి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పోరాటం కొనసాగిస్తాం.. న్యాయపరంగానూ అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తాం అని స్పష్టం చేశారు.

ఇలాంటి అక్రమ వ్యవహారాలను సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈ క్రూరమైన క్రీడను కొనసాగిస్తూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డరంటూ చేసే ఆరోపణలు సరికావు. గతంలో మేము విలీనం చేసుకున్నాం. విలీనానికి పార్టీ ఫిరాయింపులకు చాలా తేడా ఉంది అని తెలిపారు.

రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని మోడీ నుంచి రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామంటూ ఫోజులు కొడతారు. మళ్లీ అదే రాజ్యాంగం స్ఫూర్తిని దెబ్బతీసేలా అక్రమంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. పాంచ్ న్యాయ్ పేరుతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామన్న రాహుల్ గాంధీయే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు అని మండిపడ్డారు.

ఓ వైపు రాజ్యాంగ పరిరక్షణ, మరోవైపు రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే వ్యవహారాలు నడవవు. చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొనే రాహుల్ గాంధీకి రాజ్యాంగాన్ని పంపిస్తాం. ఒక్కసారి ఆయన రాజ్యాంగాన్ని చదవుకోవాలని సూచిస్తున్నాను. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై బీఆర్ఎస్ అన్ని దారుల్లో పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది అని పేర్కొన్నారు.