mt_logo

అరచేతిలో వైకుంఠం చూపెట్టి కాంగ్రెస్ గెలిచింది: సిరిసిల్లలో కేటీఆర్

సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు వార్డులలో ప్రచారం నిర్వహించి, కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..నేత కార్మికుల కోసం 3 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకున్నం. 5 ఏళ్లలో ఒక్క రూపాయి, మందు పంచలేదు.. మీరు నాకు ఇచ్చిన దయ.. రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లనే. సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చిదిద్దుకున్నం. మీరు నన్ను ఇక్కడ గెలిపించినా.. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచింది అని పేర్కొన్నారు.

మోచేతికి బెల్లం పెట్టి మోసపూరిత హామీలతో గెలిచింది. ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మొగోల్లకు మహిళకు తాకులాట పెట్టిండు.. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి. అబద్ధాలు చెపితే డిజిటల్ ప్రపంచంలో నిమిషాల్లో దొరికిపోయారు అని దుయ్యబట్టారు.

కేసీఆర్ ప్రభుత్వం పోయాకా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారు.. 100 రోజుల్లో రైతు రుణమాఫీ, ఫించన్లు వచ్చాయా.. ఓట్లు వేసుకునేటప్పుడు ఒక లెక్క ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు. 13 తేదీన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి.. తెలంగాణలో శాసించే అధికారం వస్తుంది అని పిలుపునిచ్చారు.

రాముడు అందరివాడు.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారు. వేములవాడ రాజన్న, కొండగట్టు దేవాలయాలు బీజేపీ పుట్టక ముందు నుండే ఉండేవి. సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేసినా, బీజేపీ ఒక్క పని చేసిండా శిలాఫలకం అన్న వేసిండా వారికి ఎందుకు ఓటు వేయాలి. మోడీ ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ రెట్లపై పన్నులు వేసి వసూలు చేసారు. మనకు ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అని విమర్శించారు.

అక్కరకురాని సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి. నాకు జోడిదారు దొరికితే రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుంది అని కేటీఆర్ తెలిపారు.