mt_logo

బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. పోరాడే తత్వాన్ని కోల్పోలేదు: కేటీఆర్

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్ నెలతో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత గడ్డుకాలం అని పేర్కొన్నారు.

సంవత్సర కాలంలో ఏం జరిగిందో షార్ట్ ఫిల్మ్ ద్వారా రసమయి బాలకిషన్ చూపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓడిపోయాము. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఎమ్మెల్సీ కవితను ఐదు నెలలు జైల్లో పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు అని అన్నారు.

పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఒక్కరు గెలవరు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చింది. నేడు గాంధీ భవన్ బోసిపోయింది.. తెలంగాణ భవన్ నిత్యం కళకళలాడుతోంది. లగచర్ల బాధితులను ఢిల్లీ వరకు తీసుకువెళ్లాము అని తెలిపారు.

పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని ఆశా వర్కర్లు కలిశారు. ప్రజలకు సూటిగా, సుత్తి లేకుండా అర్ధమయ్యే విధంగా రసమయి షార్ట్ ఫిల్మ్ తీశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యను లేవనెత్తుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ అధికారం మాత్రమే కోల్పోయింది.. బీఆర్ఎస్ పోరాడే
తత్వాన్ని కోల్పోలేదు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు అభిమానం తగ్గలేదు అని వ్యాఖ్యానించారు.