mt_logo

420 హామీల నుండి ప్రజలని డైవర్ట్ చేసేందుకే రేవంత్ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు: కేటీఆర్

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.

2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది..అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. 2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు. తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు అని అన్నారు

ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా? అని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్. వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోనే చెప్పిండు. పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమిటీ ప్రజలు గుర్తించాలె అని తెలిపారు.

వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.. 14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది అని కేటీఆర్ అన్నారు.

ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు.. మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు. దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది. ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది అని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది. రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.. కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు అని అన్నారు.

మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు. ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది. తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు అని వ్యాఖ్యానించారు.

ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు. వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు. వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు అని పేర్కొన్నారు.

అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు..ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు. ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు. కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు అని విశ్వాసం వ్యక్తం చేశారు.

జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.. జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు. కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది. జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. గాలికి కొట్టుకుపోయేటివి గడ్డిపోచలే.. గడ్డపారాలు కొట్టుకుపోవు.. ఇక్కడ ఎమ్మెల్యే గడ్డిపోచలాంటి వ్యక్తి అని ఫైర్ అయ్యారు.

కవితక్క సహా మీరందరూ కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. కానీ దొంగలల్లా కలిసి పోయిండు.. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోయిండు. కుండ పగిలితే పగిలింది.. కానీ కుక్క బుద్ది తెలిసిందన్నట్లుగా మీ ఎమ్మెల్యే బుద్ది తెలిసింది. అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరిన అని సంజయ్ అంటున్నాడు.. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా అన్నందుకు పోయినవా? మెడికల్ కాలేజ్ రద్దు చేస్తా అన్నందుకు పోయినవా? 4,500 డబుల్ బెడ్ రూమ్‌లు రద్దు చేస్తా అన్నందుకు పోయినవా? అని ప్రశ్నించారు.

కేవలం తన వియ్యంకుడికి బిల్లులు, సొంత క్రషర్ కోసం మాత్రమే ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి పోయిండు. దమ్ముంటే డాక్టర్ సంజయ్ రాజీనామా చేసి ముందుకు రావాలె. ఇప్పుడు జగిత్యాల ప్రజలు చేయాల్సింది ఒక్కటే సంజయ్ మళ్లీ ఓట్ల కోసం వస్తే ఉరికించి కొట్టాలె. గాలికి గడ్డపారాలు కొట్టుకుపోవు.. బీఆర్ఎస్ కార్యకర్తలు బలంగా ఉన్నారు. మళ్లీ మన పార్టీ గెలవటం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

జగిత్యాలలో సంజయ్‌కు ఒక్క ఎంపీటీసీ సీటు కూడా జీవన్ రెడ్డి ఇవ్వనియ్యడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయం.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు