mt_logo

తెలంగాణకు ఉన్న ఒక్క ఇంటి పార్టీ బీఆర్ఎస్: పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. ఆరోజు ఉన్న పరిస్థితుల్లో అనేక ప్రతికూలతలు ఉన్న తెలంగాణ కోసం పార్టీని ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు.

కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ప్రజల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం సహకారం అయింది మా పార్టీ తరపున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము.. ఆనాడు ఎన్ని రకాల కుట్రలు చేసినా సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి.. తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్ అని పేర్కొన్నారు.

సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్ గారిదే అని 2014లో మా పార్టీకి అవకాశం ఇచ్చారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశాము అని అన్నారు.

తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా వంటి రాష్ట్రంలో అద్భుతమైన స్పందన లభించింది.. దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేవు అని కేటీఆర్ తెలిపారు.

అయితే కేసీఆర్ గారు తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసు. బోధించు, సమీకరించి, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అని అన్నారు.

భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరికీ.. మాకు అందరికీ మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు.. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము ఇదే తీరుగా మా ప్రస్థానం సాగింది. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం అని స్పష్టం చేశారు.

తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అవసరం.. తెలంగాణ కంటు ఉన్న ఒక ఇంటి పార్టీ బీఆర్ఎస్. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయి.. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు ప్రాణాలు అర్పించి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాదిమంది తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు అని అన్నారు.

తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటాం.. కేసీఆర్ గారు చూపిస్తున్న బాటలో మరోసారి పూనరంకితం అవుతాం అని తెలిపారు.