mt_logo

నాడు కన్నీళ్లు కార్చిన గడ్డమీదే నేడు అద్భుత ప్రగతి

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారంనాడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నూతన  కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ నూతన కార్యాలయాన్ని, సమీకృత కలెక్టరేట్ నూతన కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరిగి అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. అనంతరం ఉద్యోగులనుద్దేశించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు  మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ అనేక రంగాలలో అగ్ర భాగాన ఉండటం చాలా సంతోషం అని అన్నారు. సహజ కవి, ఉద్వేగంతోని దు:ఖం కలిగినా, సంతోషం కలిగినా చాలా గొప్పగా పాటలు రాసే వ్యక్తి మన గోరటి వెంకన్న. ‘వాగు ఎండి పాయెరా..పెద్ద వాగు ఎండిపాయెరా..’ అని ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు మీద, గోస మీద.. దుందుభి నదీ ఏ విధంగా దుమ్ముకొట్టుకపోయిందో చెప్పడం జరిగింది, ఈరోజు నేను హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మా కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇతర మిత్రులు వస్తున్నప్పుడు, ఆ వాగు మీద కట్టినటువంటి చెక్ డ్యాంలు, వాటిలో నిలిచివున్నటువంటి నీళ్లను చూసి ఆర్ అండ్ బి మంత్రి చాలా ఆనందపరవశులైండ్రు. నేను చాలా చాలా సంతోషపడ్డానాని తెలిపారు. 

ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి గురించి నాస్కామ్ వాళ్లు రిపోర్టు అద్భుతం

ప్రొఫెసర్ జయశంకర్, నేను ఉద్యమ సందర్భంలో తిరుగుతా వుంటే లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోని నవాబ్ పేట మండల ప్రాంతంలో.. నారాయణ పేట వెళ్లి మేం వస్తా వుంటే ఆ లైట్స్ వెలుతురులో చెట్లు కూడా సన్నసన్నగా ఇంతింతే వున్నయ్..  ఈ పాలమూరు కరువేమో గానీ అడవి కూడా బక్కగై పోయిందని మాట్లాడుకున్నాం. అంత బాధ పడ్డాం.. అని గుర్తు చేసారు.  ఒక సందర్భంలో సూర్యాపేట నుంచి కల్వకుర్తి సభకి హెలికాప్టర్ లో మేం వస్తే.. ఆ దారి అంతా కూడా ఒక దరిద్రం తాండవిస్తున్నట్టుగా, ఎడారి లాగా ఎండిపోయిన చెట్లు.. చాలా భయంకరమైనటువంటి కల్వకుర్తి నియోజకవర్గ పరిస్థితి కండ్లారా చూసినం, అటువంటి చోట ఇయ్యాల కల్వకుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 75 వేలు, లక్ష ఎకరాలకు నీళ్లు వస్తా ఉన్నయ్.. పారుతా ఉన్నయ్.. ఇటువంటి ఎన్నో ఉన్నయ్.. అన్నారు. మంచినీటి పథకం కావొచ్చు.. కరెంటు కావొచ్చు. మన పర్ క్యాపిటా ఇన్ కమ్ కావొచ్చు.. అనేక రంగాల్లో మనం విజయం సాధించినం. అనేక అవార్డులు, రివార్డులు, చాలా చాలా ప్రశంసలు, పొగడ్తలు వస్తా ఉన్నయ్.. నిన్నకు నిన్న ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి గురించి నాస్కామ్ వాళ్లు రిపోర్టు విడుదల చేస్తే ఎంత అద్భుతం.. భారత దేశంలో ఐటీ సెక్టార్ లో రెండు ఉద్యోగాలు దొరుకుతున్నయ్ అంటే ఒక ఉద్యోగం ఖచ్ఛితంగా తెలంగాణలోనే దొరుకుతున్నది.

తెలంగాణ పల్లెలకు భారతదేశంలో ఉన్న ఏ  పల్లె సాటిరాదు

భారత దేశంలో ఒక ఇరవైదు వేలు, ముప్ఫై వేలు ఉద్యోగాలు గనుక ఐటీ సెక్టార్ లో వస్తే అందులో 15 వేలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఐటీ జాబ్స్.. ఓన్లీ హైదరాబాద్ లోనే వస్తా ఉన్నయ్ అని చెప్పారు. మనం తొమ్మిదో యేడు దాటి పదో ఏటిలోకి అడుగుపెట్టినం. ఓ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నం. అందులో ఒకటీ ఒకటింబావు సంవత్సరం కరోనా దెబ్బతీసింది. దాదాపు ఒక సంవత్సరం డీమానిటైజేషన్.. నోట్ల రద్దు కూడా బాగా కుదిపేసింది మనల్ని. కేవలం ఆరున్నర, ఏడు సంవత్సరాల కాలంలో ఎవ్వరి ఊహలకు అందకుండా అనేక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగడానికి బాధ్యులైన టువంటి మా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాన్నన్నారు.  ఇది ఒక వ్యక్తితోని సాధ్యమయ్యే పని కాదు,  ఒక కలెక్టరో, ఒక చీఫ్ సెక్రటరియో, ఒక ముఖ్యమంత్రో అనుకుంటే కాదు. మన సెక్రటరీల స్థాయి నుంచి సీఎస్ వరకూ.. లా అండ్ ఆర్డర్ లో మన డీజీ నుంచి కింద ఉన్నటువంటి మన పోలీస్ సిబ్బంది.. అన్ని రంగాలు సింక్రనైజ్డ్ చేస్తేనే, అన్ని కలిస్తేనే అన్ని సమకూరితేనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇందులో భాగస్వాములైనటువంటి మా తెలంగాణ ఉద్యోగులకు నేను శాల్యూట్ చేస్తా ఉన్నా. మీ అందరినీ కోరేది వలసలకూ, కరువులకూ, వలవల వలిపించే దు:ఖాలకు, బొంబాయి బస్సులకు ఆలవాలంగా ఉన్న పాలమూరులో.. బ్రహ్మాండమంటే బ్రహ్మాండం అసలు.. చాలా అద్భుతాలు జరుగుతావున్నయన్నారు.  ఇయ్యాల తెలంగాణ పల్లెలకు భారత దేశంలో ఉన్న ఏ  పల్లె సాటిరాదు. అందుకు పంచాయతీరాజ్ ఉద్యోగులకు, మన సర్పంచ్ లకు, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.. 

పాలమూరు ఎత్తిపోతల పథకం పక్కా పూర్తి…. 

మిషన్ కాకతీయ అంటే ఇరిగేషన్ అధికారులు రాత్రి పగలూ అద్భుతమైనటువంటి పని..చాలా బ్రహ్మాండంగా చేసినారు. ఒకటే ఒకటి మనకు పెద్ద టాస్క్ ఉన్నది. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలె. హండ్రెడ్ పర్సెంట్ దానిని త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాం. ధర్మం ఎప్పుడైనా జయిస్తది.. ఆ రకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించుకున్నం. నేను మీ అందరిని కూడా కోరేది ఒక్కటే..ఇంత తక్కువ సమయంలో ఏడు ఏడున్నర సంవత్సరాలలో దేశంలో మెనీ మెనీ మెనీ యాస్పెక్ట్స్ ఒకట్రెండు కాదు. అనేక యాస్పెక్ట్స్ లో దేశం కాదు, దేశంను తలదన్ని.. మనకంటే ముందు డెబ్బై సంవత్సరాలుగా రాష్ట్రంగా పొందికగా ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర కావొచ్చు.. ఎన్నో మనకంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు మనకంటే ఈరోజు పర్ క్యాపిటా ఇన్ కమ్ లో తక్కువగా ఉన్నవన్నారు.  పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ లో తక్కువగా ఉన్నవి, ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో చూసేటటువంటివి ప్రధానమైనవి మూడు నాలుగుంటయ్.. అందులో పర్ క్యాపిటా ఇన్ కమ్ ఎంత అని చూస్తరని చెప్పారు. 

పర్ క్యాపిటా ఇన్ కమ్ ఏది?

వాకిలి సూస్తనే ఇల్లు సంగతి తెలుస్తదన్న సామెత మనకు తెలుసు.. పర్ క్యాపిటా ఇన్ కమ్ ఏది? అని ప్రశ్నించారు. డంభాచారం కొడితే రాదు. గ్యాస్ ప్రచారం కొడితే ఎవడూ నమ్మడు. ఆ రోజులు పోయినయ్ ఎన్నడో.. కాబట్టి పర్ క్యాపిటా ఎంత?..పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్ ఎంత?.. మీ లిటరసీ రేట్ ఎంత?.. మీ ఐఎంఆర్ అంటే ఇన్ ఫాంట్ మోర్టాలిటీ రేట్ (శిశు మరణాల రేటు) ఎన్ని? మీ ఎం ఎం ఆర్ అంటే (మదర్ మోర్టీలిటీ రేట్) ప్రసవ సమయాలలో మరణించే తల్లుల సంఖ్య ఎంత?, వీటన్నింటిలో కూడా మనం చాలా రికార్డు హైట్స్ ను సాధించినమన్నారు. ఒక రంగం పనిచేసింది..ఒక రంగం పనిచేయలేదని కాదు. అన్ని రంగాల కృషి యొక్క సమాహారంగా, అందరి అధికారుల చెమట బిందువుల పరంగా మనం ఈరోజు చాలా చాలా అద్భుతాలు చేసినం, ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఆలోచించి.. పేదలను ఆదుకోవాలని ‘కంటి వెలుగు’ అనే పథకం పెట్టి ఊరూరికి పంపించి.. మీ కండ్లెట్లున్నయ్ తాతా?.. నీ కండ్లెంట్ల ఉన్నయ్ తల్లీ?.. అని అడిగిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉందా?. దట్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఐ స్క్రీనింగ్ టెస్ట్.

ప్రపంచం ఆరోగ్య రంగంలో నేత్ర వైద్య విభాగ నిపుణులెవరైతే ఉన్నరో..వాళ్లంతా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపడుతున్నరని చెప్పారు. ఎల్వీ ప్రసాద్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ కూడా ఒక కార్యక్రమంలో నాకు తారసపడి.. ప్రపంచవ్యాప్తంగా నేను దాదాపు డెబ్భై వరకూ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లు అటెండ్ అయినా గానీ.. ఎక్కడకూడా మాకు ఫైనల్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ రాలేదు. బట్, దిస్ మ్యాన్.. దిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ హాజ్ షోన్ ద వే.. అని చెప్పినారు.

తెలంగాణకై ఇంకా కొన్ని ఉన్నత శిఖరాలకు

ఒక పెద్ద ఛాలెంజ్ అయినటువంటి ‘మిషన్ భగీరథ’..  లాంటి అన్ని విషయాలలో చాలా గొప్ప అద్భుతాలు మనం సృష్టించగలిగామన్నారు. మన వ్యాఖ్యాత దక్షిణామూర్తి చెప్పినట్లుగా ‘మైల్స్ అండ్ మైల్స్ టు గో..స్మైల్స్ అండ్ స్మైల్స్ టు ఫ్లో..’  చిరునవ్వులు చిందించే అటువంటి ఒక ఆహ్లాదకరమైన, సంతోషకరమైనటువంటి తెలంగాణకై ఇంకా కొన్ని ఉన్నత శిఖరాలకు మనం తీసుకపోవాల్సి ఉన్నదన్నారు. మన కృషి పట్టుదలలో ఎటువంటి సడలింపులకు పోవద్దు. ఇదే విధంగా ఇంకా ముందుకు పోదాం. ఇంకా మనం ఆస్తి పెంచుదాం.. ప్రజలకు పంచుదాం.. మనం కూడా పంచుకుందాం..బ్రహ్మాండంగా మన జీతాలు కూడా పెంచుకుంటూ అద్భుతంగా ముందుకు పోదామని తెలిపారు. మీరంతా ఎల్లవేళలా..ఈ తొమ్మిదేండ్లలో చూపినటువంటి స్పిరిట్ నే ముందు కూడా చూపెట్టాలని కోరుకుంతున్న అని అన్నారు. ఆనాడు ఉద్యమంలో నాలుగైదు చోట్ల నేను ఏడ్చాను. కండ్లకు నీళ్ళు తీసుకున్నాను. నడిగడ్డ ఊరిలో రెడ్డిగారు భోజనం పెడితే జిల్లా దుస్థితిని చూసి ప్రజలంతా వలవలవల ఏడ్చారు,  అట్ల నేను కన్నీళ్ళు విడిచిన పాలమూరులో ఇంత అభివృద్ధి జరగడం గొప్ప సంతృప్తినిస్తున్నదన్నారు.