mt_logo

ఏప్రిల్ 13న చేవెళ్ళలో కేసీఆర్ బహిరంగ సభ

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసింది. 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు అని గుర్తు చేశారు.

రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చాం, నియోజకవర్గంలో స్వేచ్చ ఇచ్చాం. ఈ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ముందు అశక్తతను వ్యక్తం చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి, కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారు అని కేటీఆర్ అన్నారు.

రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకునే కవితపైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి.. అరెస్టు చేసిన రోజే ఆయన నవ్వుకుంటు పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన స్వార్థపరుడు.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళాడు అని చర్చించుకుంటున్నారు అని పేర్కొన్నారు.

గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు.. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరు.. అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవు.. స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారు అని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి మనుసులు కలిసినంత మాత్రానా..మిలాఖత్ అయినంత మాత్రనా.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని కేటీఆర్ అన్నారు.

ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉంది.. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం అని పేర్కొన్నారు.

చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన కేసీఆర్ గారి బహిరంగ సభ ఉంటుంది.. సామాజిక సమీకరణాల రిత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసం వ్యక్తం చేశారు అని తెలిపారు.

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి.. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని అని కేటీఆర్ అన్నారు.