mt_logo

తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడేది బీఆర్ఎస్సే: కేసీఆర్

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నా మెతుకు సీమ ప్రజలిచ్చిన బలంతోనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు లేకుండా నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌కు లోక్ సభ సీట్లు ఎందుకు అని తెలివి లేని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే బీఆర్ఎస్‌కు లోక్ సభ లో ఎక్కువ సీట్లు కావాల్సిన అవసరముంది. బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలుగుతాం అని తెలిపారు.

రాజకీయాల్లో అప్పుడప్పుడు లిల్లిపుట్ గాళ్లకు అధికారం వస్తది. ప్రజలు మంచి చేయమని అధికారం ఇస్తే…అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదటి సారి అంబేడ్కర్ జయంతి వస్తే కనీసం అక్కడ నివాళులు అర్పించలేదు. ఇది అహంకారమా? కండ కావరమా? అంబేడ్కర్ పేరుతో సచివాలయం పేరు ఉంది కదా… మరి అక్కడ ఎందుకు ఉంటున్నారు.. యాదగిరి గుట్ట, ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా బీఆర్ఎస్ కట్టించింది. మిషన్ భగీరథ కాల్వలు కూడా లేకుండా చేస్తారా? బీఆర్ఎస్ కట్టించిన సచివాలయంలో సిగ్గు లేకుండా ఎందుకు కూర్చుంటున్నారు? యాదగిరి గుట్టకు వెళ్లి దేవున్ని ఎందుకు మొక్కుతున్నారు? అని ధ్వజమెత్తారు.

సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులతో జహీరాబాద్‌కు నీళ్లొచ్చే విధంగా చేసుకున్నాం.. ఎందుకు దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినారో చెప్పాలె అని అడిగారు.

అంబేడ్కర్‌ను అవమానిస్తే, దళిత బంధు బంద్ పెడితే ఊరుకుందామా దళిత మేధావులు చెప్పాలె.. ఎలక్షన్స్ వస్తే ఆగమాగం కావొద్దు. పిచ్చి పిచ్చిగా ఓటు వేయొద్దు.. మొన్న వాళ్లు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలె అని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంత గౌరవం, ఎంత జీతం ఇచ్చామో గుర్తుచేసుకోవాలె. మీరంతా మేధావులు, తెలివైన వాళ్లు ఆలోచించి ఓటు వేయకపోతే నష్టపోయేది బీఆర్ఎస్ కాదు.. మీరే.. 9 ఏళ్లలో రెప్ప పాటు కరెంట్ పోకుండా చేసినం. ఇప్పుడు కరెంట్ ఉంటుందా? కరెంట్ గతంలో మాదిరిగా రావాలంటే మెదక్, జహీరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలె అని కోరారు.

బీఆర్ఎస్ లక్ష ఇస్తే మేము రూ. 2 లక్షలు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు. రాష్ట్రం ఇప్పుడు ఇట్లగే ఉండాల్నా. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలె. పదేళ్లలో రైతుల కోసం ఓ పాలసీ పెట్టుకొని పనిచేసినం. రైతుబంధే ఇప్పటికీ చాలా మందికి రాలే. పంట కొనే దిక్కు లేదు. బోనస్ అనేది బోగసేనా? వీళ్లకు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలె అని కేసీఆర్ అన్నారు.

ఎండిపోయిన పంటలకు పరిహారం, బోనస్, రైతు బంధు, రుణమాఫీ వెంటనే చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. సిద్దిపేటలో మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేయాలని నేను పిలుపునిస్తా. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతా అని ఓ మంత్రి అంటాడు. లిల్లీపుట్ గాళ్లు మెడల పేగులు వేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, చెడ్డీలు లాగేస్తా అని మాట్లాడుతున్నారు అని గుర్తు చేశారు.

పోలీసులు అరాచకాలు బంద్ చేయాలే.. లేదంటే బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత మీ గతి ఏమైతదో ఆలోచించుకోవాలె. మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయలే. పోలీసులతో చేయించాలె. మేము అన్ని రికార్డ్ చేస్తున్నాం.. ప్రజల స్పందన చూసైన పోలీసులు మారాలె. లేదంటే పోలీసులారా ప్రజలే మీపై తిరుగబడుతారు అని హెచ్చరించారు.

మా కార్యకర్త సల్వాజీ మాధవరావు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అతనిపై కేసు పెట్టారు. మా కార్యకర్తపై తప్పుడు కేసు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలె. లేదంటే న్యాయస్థానం తలుపు తట్టుతాం అని స్పష్టం చేశారు.

గతంలో ఎక్కడ చూసినా వరికోతలుండే.. ఇప్పుడు కరెంట్ కోతలు. రుణమాఫీ డిసెంబర్ 9 అన్నది పోయింది. ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నారు.. వీళ్ల మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది అని తేల్చి చెప్పారు.

గతంలో రైతులు ఎంతగా ధీమాగా ఉండే. ఇప్పుడు ఆగమైపోయినం.
నేనున్నప్పుడు రైతులకు రైతు బంధు ఎట్ల వచ్చింది. నీళ్లు, కరెంట్ ఎట్ల ఉండే, పంట కొనుగోళ్లు ఎప్పటికప్పుడు చేసినం. ఇప్పుడు రైతు బంధు లేదు. పంట కొనుగోలుకు దిక్కు లేదు. కరెంట్ లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బోనస్ విషయంలో తప్పించుకోవద్దు. రైతులకు ఎన్నికలు అయిన వెంటనే బోనస్ ఇవ్వాల్సిందే. ఎగపెడతాం అంటే ఊరుకునేది లేదు అని కేసీఆర్ హెచ్చరించారు.

పదేళ్లలో అసలు నీళ్ల కష్టం లేకుండా చేసినం. మహిళలు బిందెలతో రోడ్డు ఎక్కకుండా చేసినం. ఇప్పుడు మళ్లీ నీళ్ల కరువు ఎందుకు, ట్యాంకర్లు ఎందుకు వస్తున్నయ్. చేతగాని ప్రభుత్వం ఉంది. తొమ్మిదేళ్లు నడిచిన కార్యక్రమాలను నడిపియ్య వస్తలేదు అని విమర్శించారు.

కల్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తమన్నారు. బంగారం ఎడ పోయింది. ఎవరికైనా వచ్చిందా? మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే..ఏమీ హామీలు అమలు చేయకపోయినా మాకే ఓటు వేశారని అన్ని ఎగపెడతారు. బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలైతాయి. ప్రజాస్వామ్యంలో ఆలోచించి ఓటు వేయాలే.. గతంలో మాదిరిగా అన్ని మంచి జరగాలంటే బీఆర్ఎస్ గెలవాలె అని అన్నారు.

వాళ్లు ఐదేళ్లు పరిపాలించాలనే మేము కోరుకుంటున్నాం. అప్పుడే ఎవరు మంచి, ఎవరు చెడో తెలుస్తది. కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావని సర్వే రిపోర్ట్‌లు వస్తున్నాయి. నారాయణ పేట సభలో రేవంత్ రెడ్డి భయం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదనిపిస్తంది. ఫస్ట్ రేవంత్ రెడ్డే బీజేపీలోకి జంప్ కొడుతాడు అనిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి బీజేపీకి ఓటు వేయమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని పేర్కొన్నారు.

బీజేపోళ్లు మనకు అక్కరాని చుట్టాలు. బీజేపీకి ఓటు వేసినా మంజీర నదిలో వేసిన ఒక్కటే. ఒక్క మెడికల్ కాలేజ్, ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వని బీజేపీ కి ఓటు ఎందుకు వేయాలే..యువకులు ఆగమాగమై ఓటు వేస్తే నష్టపోయేది మనమే.. తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడే బీఆర్ఎస్‌నే గెలిపించాలె అని కోరారు.

మెదక్ అభ్యర్థిగా వెంకట్రామి రెడ్డిని, జహీరాబాద్‌లో అనిల్ కుమార్‌ను గెలిపించాలని కోరుతున్నా.. మీ ఆశీర్వాదంతో మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ గవర్నమెంట్‌ను తీసుకొస్తా అని కేసీఆర్ తెలిపారు.