mt_logo

నేను బతికున్నంత కాలం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాను: చేవెళ్ళలో కేసీఆర్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పుణ్యమా అనే ఆర్టికల్ 3 ద్వారా మనం తెలంగాణను సాధించుకున్నాం. అంబేడ్కర్ గారికి సమున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పేరు పెట్టిన గౌరవించుకున్నాం అని గుర్తు చేశారు.

సమస్య ఉంటే ఆదుకునే ప్రభుత్వం మాకు ఉందని ప్రజలకు ధీమా ఉండాలె. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంతులేని హామీలు, ప్రలోభాలతో కిందమీద చేస్తే కాంగ్రెస్ గెలిచింది.. 4 నెలల అయిన సరే వారి చిత్తశుద్ది లేదు.. ఓ పాలసీ అంటూ లేదు.. ఉన్న వనరులను వాడుకునే తెలివి లేదు విమర్శించారు.

10 ఏళ్ల కింద మనం మరచిపోయిన సమస్యలన్ని మళ్లీ కనబడుతున్నాయి.. నేను చావు నోట్లో తలపెట్టి, ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేస్తే తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు చాలా సమస్యలుండే. కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్లు రైతాంగాన్ని కాపాడుకున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.

రైతులను కాపాడుకునేందుకు ఒక పాలసీ పెట్టుకున్నాం.. రైతాంగానికి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 5 పథకాలు చేపట్టాం. రైతుబంధు, నాణ్యమైన విద్యుత్, రైతు బీమా, పంట కొనుగోలు లాంటి పథకాలతో రైతులకు ధీమా ఇచ్చాం అని తెలిపారు.

అంబేడ్కర్ గారు, ఫూలే గారి ఆశయాలను గత 70 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఆచరణలో పెట్టాం. 1100 గురుకుల పాఠశాలలను పెట్టుకున్నాం. రూ. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ పెట్టుకున్నాం. 5 నెలలుగా ఒక్కరికి కూడా ఓవర్సీస్ స్కాలర్ షిప్‌ను ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు అని దుయ్యబట్టారు.

దళితులు ధనికులు కావాలని దళిత బంధు పేరుతో పది లక్షలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. దళిత బంధులో భాగంగా లక్షా 30 వేల మందికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పది లక్షలు విడుదల చేసినం. 12 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దళితులు, దళిత మేధావులు కచ్చితంగా నిలదీయాలె. లక్షా 30 వేల మంది దళిత బిడ్డలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం దగ్గర నేనే దీక్ష చేస్తా అని కేసీఆర్ హెచ్చరించారు.

ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు కోసం విడుదల చేసిన పది లక్షల రూపాయల దళిత బంధు వచ్చేలా చేస్తాం. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిసి ఇస్తా అన్నారు. ప్రభుత్వానికి కొనటానికి బంగారం దొరకటం లేదా? అని ప్రశ్నించారు.

చేనేత కార్మికులకు, గౌడ బిడ్డలకు, గొల్ల కురుమలకు, యాదవ్ లకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపట్టాం. బీసీ బంధు పెట్ట బలహీన వర్గాలకు మేలు చేశాం. ఈ ప్రభుత్వం ఇప్పుడు వాటిని కొనసాగిస్తాదా? లేదా? ప్రజలు నిలదీసి అడగాలె అని అన్నారు.

రైతులు, వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం. కేసీఆర్ పక్కకు పోగానే 24 గంటల కరెంట్ ఉండకుండా పోతదా? అంటే ఇది వీళ్ల చేతగాని తనం.. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం.. ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుంది. ఇప్పుడు కరెంట్ కు ఏం రోగం వచ్చింది. నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు.. ఇదేమీ లోపం? అని కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలె.. ఎందుకు పాత ప్రభుత్వం పోగానే ప్రజలకు ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినయ్. ప్రభుత్వాన్ని ఈ అంశాల్లో నిలదీసే అంకుశం మనకు కావాలె. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే అన్ని లోక్ సభ సీట్లు బీఆర్ఎస్ గెలవాలె అని తెలిపారు.

మళ్లీ కాంగ్రెస్ కు ఓటేస్తే…మేము ఏం చేయకపోయినా సరే ప్రజలు మమ్మల్ని గెలిపించారంటారు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది..లేదంటే వాళ్లు పని పక్కన పెట్టి ఎల్లెంక పంటరు అని కేసీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. నా ముందే ప్రజలు ఇన్ని అవస్థలు పడుతుంటే నాకు బాధనిపిస్తోంది. నేను బతికి ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాను.. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల వెంటనే ఉంటది అని స్పష్టం చేశారు.

రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది.. ఎందుకు పార్టీ మారిండు? బీజేపీ, కాంగ్రెస్ తరపున నిలబడ్డ వ్యక్తులెవరు ప్రజలకు తెలిసిన వారు కాదు.. ఎందుకు రంజిత్ రెడ్డి పార్టీ మారిండు.. ఇలాంటి వ్యక్తులకు మీరే ధీటైన బుద్ధి చెప్పాలె అని ప్రజలను కోరారు.

అన్ని పంటలు కొంటామని ప్రభుత్వం మాట ఇచ్చింది. వానాకాలం పంట కొనుగోళ్లు స్టార్ట్ అయ్యాయి. మరి రూ. 500 బోనస్ ఇస్తారా? ఇయ్యారా ? ఇస్తా అని ఇవ్వకపోతే ఓట్ల రూపంలో గుద్ది వాళ్లను ఓడగొట్టాలె అని అన్నారు.

హామీ ఇచ్చిన విధంగా ఆడపిల్లలకు స్కూటీలు లేవు గానీ.. హైదరాబాద్‌లో లూటీ మాత్రం మొదలుపెట్టిన్రు. కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల అయ్యింది. రియల్ ఏస్టేట్ మీద బతికే వేలాది మంది బతుకులు ఆగమైనయ్. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామా? అలాగే వదిలేద్దామా? అని ప్రజలను అడిగారు.

భావాద్వేగాలు లేపటం తప్పా.. బీజేపీతో ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా? అయితే మోడీ లేదంటే ఈడీ. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం. ఈ బీజేపీ పరిపాలనను మన పదేళ్లుగా చూడటం లేదా? అని అన్నారు.

దేశంలో 157 మెడికల్ కాలేజ్ ఇస్తే మనకు ఒక్కటి కూడా ఇయ్యలె. నేను వంద ఉత్తరాలు రాసిన స్పందించలే. ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలే. ఇలాంటి బీజేపీకి మనం ఎందుకు ఓటు వేయలే. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ నా మెడ మీద కత్తి పెట్టిండు. కానీ రైతాంగాన్ని కాపాడుకునేందుకు నా ప్రాణం పోయిన సరే మీటర్లు పెట్టనని చెప్పిన. బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే మళ్లీ రైతుల మోటార్లకు మీటర్లు వస్తాయి. మీటర్లు రావద్దంటే బీజేపీని గుద్దుడు గుద్దలే. నేలకేసి కొట్టాలె. అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్లు అని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలో ధాన్యం ఎక్కువగా పండింది. వాటిని కొనమంటే బీజేపీ కేంద్రమంతి మీ వారికి నూకలు తినిపియ్యండి అంటాడు. మనల్ని నూకలు తినమన్న బీజేపీపీ నూకలు తినిపిచ్చే పనిచేద్దామా? మన సీలేరు ప్రాజెక్ట్ ను, మన 7 మండలాలను మనకు కాకుండా చేసింది బీజేపీ. ఐటీఐఆర్‌ను రద్దు చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాకర్టీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని పెట్టలేదు బీజేపీ.. మత్తులో పడి మతంలో పడి పిచ్చిలో ఓటు వేస్తే మనం కూడా పిచ్చి లేసి పోతాం అని హెచ్చరించారు.

కేంద్రంలో 30 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్.. వాటికి బీజేపీ నింపటం లేదు. గుడ్డి కన్ను మూసినా ఒక్కటే తెరిచినా ఒక్కటే. అట్లగే బీజేపీకి ఓటు వేస్తే ఒక్కటే? వేయకపోయినా ఒక్కటే అని ఎద్దేవా చేశారు.

వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలు తెచ్చుకున్నాం. చేవేళ్లను పారిశ్రామిక కేంద్రంగా చేసే ప్రయత్నం చేశాం. పాలమూరు ఎత్తిపోతల, ఉద్దండపూర్ రిజర్వాయర్ విషయంలో ఈ ప్రభుత్వం పాలసీ ఏందీ? అని ప్రశ్నించారు.

బలహీనవర్గాల కోసం ఆస్తిని, జీవితాన్ని ధారపోసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. బీసీలకు దమ్ముంటే కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి చూపించాలె అని ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి బీసీల శక్తి, బీసీల రాజకీయ చైతన్యాన్ని చూపించాలె అని పిలుపునిచ్చారు.

రైతుతడిసిన ధాన్యాన్ని కూడా ఒక్క గింజ వదలకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. చేవెళ్ల సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే కాసాని జ్ఞానేశ్వర్ గారి విజయం ఖాయమైందని తెలిసిపోయింది అని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.