శాసనమండలిలో భూభారతి బిల్లుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. ధరణి వచ్చిన తర్వాత భూమోసాలు పోయాయి. తెలంగాణ రైతకు రక్షణ కవచం ధరణి. ధరణితో ఆటలాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదు. ప్రజలు వెంటబడి మరీ ధరణిని తిరిగి సాధించుకుంటారు అని పేర్కొన్నారు.
భూభారతి ఒక తిరోగమన చర్య. భూభారతి చట్టం భూహారతి అయ్యేటట్లు కనిపిస్తుంది. భూమాత పోర్టల్ భూమేతకే దారి తీస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే భూ రక్షణ సమితి అని రైతులు, ప్రజలు అనుకుంటున్నారు. భూమి కోసం ప్రాణమిచ్చేది ఇద్దరే.. ఒకరు సైనికుడు, మరొకరు రైతు. ఏమైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లాలి తప్పా వ్యవస్థనే రద్దు చేయడం సరికాదు అని అన్నారు.
ధరణిలో కుట్ర కోణం ఉన్నదని ప్రభుత్వం చెప్పడం దారుణం. మాతృభూమి కోసం సైనికుడు ప్రాణమిస్తే.. సాగు భూమి కోసం రైతు ప్రాణమిస్తారు. తెలంగాణలో 2.8 కోట్ల ఎకరాల భూమి ఉంది.. అందులో 1.5 కోట్ల ఎకరాలు సాగు భూమి. 17.8 లక్షల ఎకరాలు మాత్రమే వివాదాల్లో ఉంది. గతంలో కౌలుదారులు కేసులు వేస్తే 20-25 ఏళ్ల పాటు రైతులు కోర్టుల చుట్టు తిరిగే పరిస్థితి ఉండేది. కాబట్టి అన్ని ఆలోచించి కేసీఆర్ రైతుకు మాత్రమే భూమికి యాజమన్య హక్కు ఉండే విధంగా చేశారు అని కవిత తెలిపారు.
రైతులకు భూభద్రతను కల్పించిన వ్యక్తి కేసీఆర్. ధరణి వల్ల అనేక భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. దాదాపు 35749 ఉద్యోగోలు 100 రోజుల్లో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళణ చేశారు. ఆ తర్వాత భూవివరాలను ధరణిలో ఎక్కించారు. ధరణి కన్నా ముందు చార్మినార్ కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండేది. ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కాపాడింది. ధరణి వచ్చిన తర్వాత ఒక్క గుంట ప్రభుత్వ భూమి కూడా అన్యక్రాంతం కాలేదు అని అన్నారు.
భూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేరువ చేసింది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే సారి చేయడం వల్ల 42 నిమిషాల్లో పని పూర్తయ్యేది. భూమికి సంబంధించి అన్ని పనులు నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి. భూరికార్డుల సరిగ్గా ఉండడం వల్ల భూములు రేట్లు పెరిగాయి, రాష్ట్ర సంపద పెరిగింది. మ్యాన్యువల్ పహాణీల వల్ల రాష్ట్రంలో అనేక వివాదాలు ఏర్పడేవి.. ధరణి ఆ సమస్యను తీర్చింది అని గుర్తు చేశారు.
భూరికార్డులు, యాజమానుల పేర్లు స్పష్టంగా ఉండడం వల్ల రైతులకు రైతుబంధు అందింది. దాదాపు 66 లక్షల మందికి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు అందించింది. గతంలో పంట రుణాలు కూడా వచ్చేవి కావు… ధరణి వచ్చిన తర్వాత బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. తద్వారా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు విముక్తి అయ్యారు. ధరణికి ముందు లక్షలాది మంది ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురయ్యారు. భూదాన్, అటవీ, ప్రభుత్వం భూములు అన్యక్రాంతం కాకుండా ఉండేందుకు వాటిని పార్ట్-బీలో చేర్చాము. ఎంజాయ్మెంట్ సర్వే చేయిస్తామని ప్రభుత్వం చెబుతుంది. దీనివల్ల గ్రామాల్లో లేని తగాదాలు మొదలువుతాయి. మళ్లీ 32 కాలమ్లతో పహాణీలను రాయడం ప్రారంభిస్తే మళ్లీ పాత వ్యవస్థ వస్తుంది అని హెచ్చరించారు.
రైతుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. తద్వారా కేసుల భారం, ఆర్థిక భారం అవుతుంది. రాష్ట్రమంతా ఒకేసారి కాకుండా.. దశల వారీగా రీసర్వే చేపట్టాలి. ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా పాస్బుక్లు ఉన్నాకా.. భూధార్ కార్డు ఎందుకు? ఖాతా నెంబరు ఉన్న తర్వాత భూదార్ నెంబరు ఎందుకన్నది ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికన్నా ప్రభుత్వం నిజాలు చెప్పాలి అని కవిత డిమాండ్ చేశారు.
హైదరాబాద్ చుట్టుముట్టున్న ఆబాదీ భూములపై ప్రభుత్వం పెద్దల కన్ను పడిందని ప్రచారం జరుగుతోంది. భూభారతి వల్ల తప్పు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు శిక్ష వేస్తామని భయపెట్టడం సరికాదు. భూభారతిలో కౌలుదారులు, అనుభవదారుల కాలమ్ పెట్టే ఆలోచనను విరమించుకోవాలి. కౌలుదారులను వేరే విధంగా ఆదుకోవాలి అని అన్నారు.