
మంత్రివర్గంలో చోటు కోసం లాబీయింగ్ చేస్తున్న ఎమ్మెల్యేలు, ఇతర కార్పొరేషన్ పదవుల కోసం ఆశావహులు అనేకమంది రేవంత్ రెడ్డి వెంట అమెరికా వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. ఇక్కడ రేవంత్ బిజీగా ఉండటం వల్ల టైం ఇవ్వడం లేదని.. అమెరికాలో కొంత సమయం దొరికే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో సుమారు డజన్ మంది నాయకులు ఎయిర్ టికెట్లు బుక్ చేస్కుంటున్నారని టాక్ నడుస్తుంది.
ఈసారి రేవంత్ పర్సనల్ పీఆర్ టీం కూడా భారీగానే ఉండబోతుంది అని సమాచారం. జూన్ నెలలో ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో అనౌన్స్ చేయకుండా ఆపిన 4-5 పెట్టుబడుల ప్రకటనలు రేవంత్ పర్యటనలో చేస్తారని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
రేవంత్కు పర్సనల్ పీఆర్వోగా పనిచేస్తున్న డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరాం కర్రి పేరు ఇదివరకే ఖరారు అయ్యింది. కానీ ఆయనను దావోస్ పర్యటనకు తీసుకెళ్లిన నోట్ ఫైల్ కాపీ కావాలంటూ పలు మీడియా సంస్థల జర్నలిస్టులు సమాచార హక్కు చట్టం కింద సెక్రటేరియట్లో దరఖాస్తు చేస్కోవడంతో ప్రభుత్వం కొంత డైలమాలో ఉందని సమాచారం.
ఇక సీఎం సీపీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి ఈసారి నేను కూడా వస్తాను అని సీఎం రేవంత్ రెడ్డిని బతిమిలాడుకుంటున్నట్టు సమాచారం. దీంతో పాటు ఒకరిద్దరు అడ్వైజర్లు కూడా ఆల్రెడీ టికెట్లు కొనుక్కున్నారట. మొత్తానికి ఈసారి రేవంత్ పర్యటనలో జంబో టీం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర ఖజానాకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది అని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి