mt_logo

సబితకు అసెంబ్లీలో రెండు నిమిషాలు అవకాశం ఇవ్వని వీళ్లకు కేసీఆర్ ఎందుకు?: జగదీష్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా దాడి చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అనుచితంగా మాట్లాడారని.. బయట జరుగుతున్న సంఘటనలకు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు తేడా లేదు అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మంచి పరిణామం. కేసీఆర్ సీఎం అయ్యాక అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం అమరులు అయిన కుటుంబాలను కేసీఆర్ ఆదుకున్నారు.. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన వారికి ధన్యవాదాలు అని తెలిపారు.

అసెంబ్లీలో దుశ్శాసనపర్వం నడుస్తోంది.. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు.. సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా దాడి చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అనుచితంగా మాట్లాడారు. బయట జరుగుతున్న సంఘటనలకు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు తేడా లేదు అని దుయ్యబట్టారు.

భట్టి తనకు రేవంత్ రెడ్డిపై ఉన్న కోపాన్ని సబితా ఇంద్రారెడ్డిపై చూయించారు. భట్టికి ఎప్పుడో ప్రతిపక్ష హోదా పోయిందని ఇప్పుడు బాధపడుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న శాంతిభద్రతలపై మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారింది. నిన్నటి నుండి సబితా ఇంద్రారెడ్డికి అసెంబ్లీలో రెండు నిమిషాలు అవకాశం ఇవ్వలేదు అని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను సరిగా పని చేయనివ్వడం లేదు.. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల బంధువుల పాత్ర ఉంది. సబితా ఇంద్రారెడ్డిని చూసి వణుకుతున్న వీళ్లకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంట. సబితకు అసెంబ్లీలో రెండు నిమిషాలు అవకాశం ఇవ్వని వీళ్లకు కేసీఆర్ ఎందుకు అని ధ్వజమెత్తారు.

సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరితే సభా సమయం వృధా అవుతుందని అంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అనే సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు.. మహిళలకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడకుండా 20 మంది
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడించారు అని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామో ప్రజలు అనుకుంటున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం ఏలాలని చూస్తున్నారు. సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదు..సభలో లేని వారిపై స్పీకర్ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి. అయినా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. తమ బండారం బట్టబయలు అవుతుందని ప్రభుత్వం భయపడుతోంది అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు

సీఎం ప్రవర్తనతో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారం తగ్గించుకోవాలి.. స్పీకర్ సభలో మా హక్కులను కాపాడాలి అని కోరారు.

అసెంబ్లీ పట్ల ప్రజల్లో గౌరవం తగ్గే విధంగా వ్యవహరించవద్దు.. సీఎం ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడారా. నేను సబ్జెక్ట్ మాట్లాడితే నాపై సీఎం వ్యక్తిగత ఆరోపణలు చేశారు..సభకు తాగివచ్చే వారితో నన్ను తిట్టించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం వుంటే సబితకు మైక్ ఇవ్వాలి ఆని సవాల్ విసిరారు.

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్ని తప్పులు మాట్లాడుతున్నారు.. ప్రభుత్వం లక్షన్నర రుణమాఫీ చేస్తే రూ. 11 వేల కోట్లు కాలేదు.. అదో రుణమాఫీనా? రైతులను దొంగలుగా రేవంత్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు.. వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల రుణాలు తీసుకున్న బ్యాంకు దొంగలు బీజేపీ,కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నారు అని ఫైర్ అయ్యతి.

అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడించకపోయినా ప్రజాక్షేత్రంలో మాట్లాడతాం.. ఎప్పుడు అసెంబ్లీకి రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసు. మీ బాసుల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు. ధరణిపై చర్చ పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని జగదీష్ రెడ్డి అడిగారు.

డెమాక్రటిక్‌గా ఉంటున్నామనే పదాన్ని బట్టి పట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. మేము ఒక్కరు మాట్లాడితే ప్రభుత్వం నుంచి ఐదుగురు మంత్రులు మాట్లాడుతున్నారు అని అన్నారు.