రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. ఇదే వేదికగా 310 మంది ఫార్మసిస్టులకు పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… నేడు ఫార్మసిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ వైద్య ఆరోగ్యశాఖ కుటుంబంలో చేరుతున్న 310 మంది ఫార్మసిస్టులకు స్వాగతం తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 105, టీవీవీపీ పరిధిలోని 135, డీఎంఈ 70 పోస్టులకు గాను మొత్తం 310 మంది ఎంపికయ్యారు. ఆస్పత్రిలో సేవలు బాగుండాలంటే అందరికీ తగినన్ని ఔషధాలు ఉండాలి. ఔషధాలను సమకూర్చడం, రోగులకు అందించడంలో ఫార్మసిస్టులది కీలకపాత్ర అని పేర్కొన్నారు.
మరో 7291 పోస్టుల భర్తీ
ప్రభుత్వ ఉద్యోగం అనేది గొప్ప అవకాశం. ప్రైవేటు ఉద్యోగాలతో ఉపాధి దొరికితే.. ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది. రోగులకు చిరునవ్వుతో మందులు అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారన్నారు. 9 ఏళ్లలో వైద్య శాఖలో 22,600 పోస్టులు భర్తీ చేసుకున్నాం, మరో 7291 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో 5204 స్టాఫ్ నర్స్ పరీక్ష పూర్తి అయ్యింది, వారం పది రోజుల్లో ఫలితాలు ఇస్తాం. 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, 1931 MPHA ఫిమేల్ (అప్లికేషన్ స్టేజ్) పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా పూర్తయితే పదేళ్లలోనే 30 వేల ఉద్యోగాలు వైద్య శాఖలో ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. వైద్యారోగ్య శాఖ పదేళ్ల ప్రగతి నివేదిక విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో, మా ప్రభుత్వం, మా వైద్యారోగ్య శాఖ పనితీరుకు నిదర్శనం ఈ నివేదిక. పదేళ్ల ప్రయాణాల్లో ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యింది. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించింది. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి కేసీఆరే అని అన్నారు. 2014 లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో 11 వ స్థానంలో ఉంటే. ఇప్పుడు 3 వ ర్యాంకుకు చేరుకున్నాం. మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నాం. వైద్య సిబ్బంది సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ప్రజలకు మంచి సేవలు అందించడంలో, ప్రజల ప్రాణాలు కాపాడటంలో నిత్యం నిమగ్నమై కృషి చేస్తున్న మా వైద్యారోగ్య శాఖలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు, శుభాకాంక్షలు.
ఒక్కొక్కరి వైద్యం పట్ల చేస్తున్న తలసరి ఖర్చు రూ. 3,532
ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు సీఎం కేసీఆర్ పాలనలో పోదాం బిడ్డో సర్కారు దవాఖానకే అనేలా మార్పు జరిగిందని తెలిపారు. మంత్రమేస్తెనో, మాయ చేస్తెనో జరిగిన అద్భుతం కాదిది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 12,364 కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం. ఒక్కొక్కరి వైద్యం పట్ల చేస్తున్న తలసరి ఖర్చు రూ. 3,532, దేశంలో మూడో స్థానం. తెలంగాణ వైద్యారోగ్య రంగం ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా తట్టుకోవడానికి సర్వసన్నద్ధంగా రూపొందింది. మొత్తం 50 వేల పడకలతో కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనేలా సిద్దమైంది.
119 నియోజకవర్గాల్లో ఒక్కో డయాలసిస్ కేంద్రం
గ్రామ స్థాయిలో పల్లె దవాఖానలు, పట్టణ స్థాయిలో బస్తీ దవాఖానలు, మండల స్థాయిలో పీహెచ్సీలు, నియోజకవర్గ స్థాయిలో 100 పడకలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లాకో నర్సింగ్ కాలేజీ, జిల్లాకో పారా మెడికల్ కాలేజీ, వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణం, నలువైపులా టీమ్స్ ఆసుపత్రులు, 4000 పడకలుగా నిమ్స్ విస్తరణ, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ (MCH) నిర్మాణం.. చేపట్టామని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో ఒక్కో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నిమ్స్ ఆస్పత్రిలో ఆరు నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు
అవయవ మార్పిడుల్లో దేశంలోనే తెలంగాణ భవిష్కరణలో ఉందని కేంద్రం ఇటీవలే చెప్పింది. ముఖ్యంగా నిమ్స్ ఆస్పత్రిలో ఆరు నెలల్లోనే 100 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో 8వ ఫ్లోర్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ లో ప్రతి నెల సగటున 8 మందికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ఉచితంగా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ మార్పిడులు చేసుకునేలా మారబోతున్నాయి. ఔషధాల అందుబాటు, పంపిణీ ప్రక్రియలో తెలంగాణ గతంలో మూడో స్థానంలో ఉండేది. త్వరలో రెండో స్థానంలోకి చేరబోతుంది. కొత్తగా ఫార్మసిస్టులు చేరికతో మొదటి స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను.
త్వరలోనే ఎయిర్ అంబులెన్సులు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నాం. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్వారా వారిని దవాఖానకు తరలిస్తాం. కోటీశ్వరులకే పరిమితమైన ఈ సేవలను పేదలకు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దని స్పష్టం చేసారు. నిమ్స్ లో ఈరోజు నుంచి వారం రోజుల పాటు బ్రిటన్ కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ అరుణ్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రజల ఆశీస్సులు దీవెనలు ఉన్నంతకాలం వైద్య ఆరోగ్య శాఖను మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. పీహెచ్సీలు స్థాయి నుంచి అన్ని స్థాయి దవాఖానాల్లో ప్రగతి నివేదికను ప్రదర్శించాలని అధికారులకు సూచించాం. మా రిపోర్టును చూసి ప్రజలంతా ఆశీర్వదించండి. మరింత ఉత్సాహంతో సేవలు అందిస్తామని పేర్కొన్నారు.