- జూలైలో ‘గృహలక్ష్మి’ శ్రీకారం
- సొంత జాగా ఉంటే రూ.3లక్షల సాయ
- ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: కిరాయి ఇండ్లల్లో అవస్థలుపడుతున్న తెలంగాణలోని ప్రతి నిరుపేద కుటుంబం ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి సొంత ఇల్లు ఉండాలి. అదికూడా డబుల్ బెడ్ రూం అయి ఉండాలని సీఎం కేసీఆర్ దేశంలోనే సరికొత్త పథకానికి రూపకల్పన చేశారు. రూ. 18 వేల 328 కోట్ల వ్యయంతో 2.91 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి, పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా వంద శాతం సబ్సిడీతో పంపీణి చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. జీహెచ్ఎంసీ పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇండ్లను పూర్తిచేశారు. ఇప్పటికే 60వేలకుపైగా లబ్ధిదారులకు అందజేశారు. అతిత్వరలోనే మరిన్ని డబుల్ బెడ్రూంలను అందించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ లక్ష ఇండ్లను పూర్తిచేశారు. అతి త్వరలోనే అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పుడు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునేవారి కోసం సరికొత్త పథకంతో ముందుకొచ్చారు. తెలంగాణ పదేండ్ల పండుగ సందర్భంగా ప్రతి నిరుపేద మొఖంలో ఆనందం నింపేలా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు.
మాట నిలబెట్టుకొంటున్న కేసీఆర్
సొంత జాగల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ సర్కారు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జులై నుంచి పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో ప్రజలకు మేలు కలిగేలా పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. అందుకు అనుగుణంగా పలు కార్యక్రమాలకు సంబంధించి రూపకల్పనపై సీఎం తుది నిర్ణయంతీసుకున్నారు. గతంలో శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మార్చిలో జరిగిన ‘గృహలక్ష్మి’ అమలుకు నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముందుగా 3వేల మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్తోమత లేనివారికి, అలాగే ఇల్లు కూలిపోయిన వారికి ఈ పథకం వర్తించనున్నది. అలాగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వెంటనే చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులకు రూ.3 లక్షలను మూడు దఫాలుగా లక్ష చొప్పున ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అందుకోసం బడ్జెట్లో రూ.12వేల కోట్లను కేటాయించింది. దీంతోపాటు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి, ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం నిర్ణయించారు. తెలంగాణ పదేండ్ల పండుగ సందర్భంగా నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేలా కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమ బతుకుల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని అంటున్నారు.