mt_logo

గృహ లక్ష్మి పథకంతో 4 లక్షల కుటుంబాలకు లబ్ధి – గైడ్ లైన్స్ జి.ఓ విడుదల

  • సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు 3లక్షల ఆర్థిక సాయం
  • ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు
  • మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి 

హైదరాబాద్: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆశయమని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గృహలక్ష్మి పథకం అందుకు సంబంధించిన గైడ్ లైన్స్ జి.ఓ విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గృహ లక్ష్మి పథకం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వరం లాంటిదన్నారు.కేసీఆర్ గారి మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు. సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు 3లక్షల ఆర్ధిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల ఇండ్లు చొప్పున మొత్తం 4లక్షల ఇండ్లు నిర్మాణానికి 7,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 4 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిత్యం పేదల సంక్షేమం కోసమే ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేదల పక్షాన మంత్రి తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.