శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో నేరాలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటంపై హోంమంత్రి స్పందించారు. పోలీసులు పెట్రోలింగ్ వాహనాలు ఎక్కినప్పుడు తమవద్దనున్న ఫోన్లను సరెండర్ చేస్తారని, ఆ తర్వాతే పెట్రోలింగ్ వాహనాలు ఎక్కుతారని, పోలీసులను అవమానపరచడం సరికాదని అన్నారు. రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఇంకా చేస్తున్నామని, గస్తీ కోసం వాహనాలను ఉంచుతున్నామని తెలిపారు.
పాత నేరస్తులను కట్టడి చేసేందుకు చట్టాల్లో మార్పులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో క్రైం రేట్ తక్కువగా ఉందని నాయిని పేర్కొన్నారు. క్రైమ్ ను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గొలుసు దొంగతనాలు తక్కువేనని, గొలుసు దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాకుండా కరడు కట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని హోంమంత్రి వివరించారు.