mt_logo

బీసీలకు ఆర్థిక సాయం… తెలంగాణ సర్కారు శుభవార్త

  • బీసీలకు లక్ష ఆర్థిక సాయం నిరంతర ప్రక్రియ
  • ప్రతి నెల 15వ తారీఖున పథకం గ్రౌండింగ్
  • ఈనెల ప్రతి నియోజకవర్గంలో 300 మంది లబ్దిదారులకు అందజేత
  • జిల్లాల యంత్రాంగంతో వేగంగా 5,28,000 దరఖాస్తుల పరిశీలన

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన బీసీ కుల వృత్తుల లక్ష ఆర్థిక సహాయం పథకం ఈనెల లబ్దిదారులకు అందించేందుకు సర్వం సిద్ధం చేసామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. నిరంతరాయ ప్రక్రియగా బీసీలకు ఆర్థిక సాయం కొనసాగిస్తామని, ఇదే అంశంపై నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ నెల పదిహేనో తారీఖున క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన దాదాపు 300 మంది లబ్దిదారులతో ప్రతి నియోజకవర్గంలోనూ పథకం గ్రౌండింగ్ కొనసాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేసే ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం పాల్గొంటారని, బీసీ కుల వృత్తుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ జిల్లా స్థాయి యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 5,28,000 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జిల్లా యంత్రాంగంతో వేగవంతంగా కొనసాగుతుందని తెలియజేసారు. 

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కులవృత్తి దారులను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి లక్ష రూపాయల తోడ్పాటును అందిస్తుందన్నారు. తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా వారి వృత్తికి సంబంధించి పనిముట్లు, ముడి పదార్థాలు వంటివి తీసుకునేందుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ గొప్ప పథకాన్ని సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించుకున్నామని, నిరంతరాయ ప్రక్రియగా కుల వృత్తి దారులకు సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రతి నెల పదిహేనవ తారీఖు వరకు లబ్దిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, తదనంతరం పదిహేనో తారీఖు నుండి స్థానిక ఎమ్మెల్యేల చేతులమీదుగా అందజేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణలా కృషి చేయలేదని, సంక్షేమ గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య, చేతివృత్తుల దారులకు ఆర్థిక తోడ్పాటు, ప్రభుత్వం అమలు చేసే  కల్యాణలక్మీ తదితర ప్రతి సంక్షేమ కార్యక్రమంలో గణనీయ వాటాను బీసీలకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.