mt_logo

ఈటెల రాజేందరన్న హుజూరాబాద్‌, గజ్వేల్‌లలో ఓడిపోతే మల్కాజ్‌గిరి‌కి వచ్చిండు: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ అన్న హుజూరాబాద్‌లో గజ్వేల్‌లో ఓడిపోతే మల్కాజ్‌గిరి‌కి వచ్చిండు. హుజూరాబాద్‌లో సెంటిమెంట్ మాటలు చెప్పి.. గెలిచిన తర్వాత ముఖం చాటేసిండు అని అన్నారు.

రాజేందర్ అన్న నువ్వు బీఆర్ఎస్‌లో ఉన్నా అనుకుంటున్నావ్.. మీ బీజేపి, నరేంద్ర మోడీ రూ. 14.50 లక్షల కోట్లు కార్పొరేట్లకు రుణాలు మాఫీ చేసినారు గాని రైతన్నలకు ఒక రూపాయి మాఫీ చేయలేదు. అటువంటి పార్టీలో ఉండి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటది అని కేటీఆర్ పేర్కొన్నారు.

దమ్ము, ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ, బీజేపీ మల్కాజ్‌గిరికి, కంటోన్మెంట్‌కి ఏం చేసిందో చెప్పి ఈటెల ఓటు అడగాలి.. 609వ స్థానంలో ఉన్న అదానిని తీసుకువచ్చి రెండో స్థానంలో కూర్చొపెట్టినందుకు నరేంద్ర మోడీ నీతిమంతుడా అని ప్రశ్నించారు.

రాజకీయాలలో సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం.. అది మన రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఉన్నది. మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అంతా కేసీఆర్ ద్వారా పదవులు పొంది వెన్నుపోటు పొడిచి వెళ్లిన వాళ్ళే, వాళ్లుకు బుద్ది చెప్పాలి అని పిలుపునిచ్చారు

మల్కాజ్‌గిరిలో నిలబడింది లక్ష్మారెడ్డి గారు కాదు మన గులాబీ సైనికులంతా నిలబడ్డారు అన్నట్లు పనిచేద్దాం.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీనే స్వయంగా పోటీలో ఉందని కష్టపడి గెలిపించుకుందాం అని అన్నారు.

మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మూడున్నర లక్షల మెజార్టీ మన పార్టీకి ఉన్నది.. అయినా మనం మన కార్పొరేటర్ ఎన్నికల స్థాయిలో, సర్పంచ్ ఎన్నిక స్థాయిలో మల్కాజ్‌గిరిలో పనిచేద్దాం. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి.. మన అభ్యర్థి ఎంత తిరిగినా.. మన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు విస్తృతంగా పర్యటనలు, ప్రచారం చేయాలి అని కేటీఆర్ కోరారు.