mt_logo

ఆసియాలోనే అతి పెద్దదైన కొల్లూరు హౌసింగ్ కాలనీని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఆసియాలోనే అతిపెద్దదైన సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని కేసీఆర్‌ నగర్‌ డబుల్ బెడ్రూం డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 111 ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఇండ్ల వివరాలను ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
సుమారు 60 వేల మంది నివాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా కార్పొరేట్‌ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించారు.ఈ హౌసింగ్ కాలనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.