
రెండో విడత ఎంపికైన లబ్దిదారులకు ఈ నెల 21 వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో అన్ని సౌకర్యాలతో కూడిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా మొదటి విడతలో ఎంతో పారదర్శకంగా NIC రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ నెల 2వ తేదీన 8 ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ఇండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 15 వ తేదీన కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి 13,200 మంది లబ్దిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. డ్రాలో ఎంపికైన లబ్దిదారులకు ఈ నెల 21 వ తేదీన 9 ప్రాంతాలలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
ఎవరు ఎక్కడ పంపిణీ చేస్తారు..
- కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ లో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు 2100 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు
- మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్ సాన్ పల్లిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 700 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
- ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అట్టిగూడ లో భూగర్బ గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి 432 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
- ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తట్టి అన్నారంలో హోంమంత్రి మహమూద్ అలీ 1268 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
- ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని తిమ్మాయిగూడ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 600 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
- పటాన్ చెర్వు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు 2 లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు 4800 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
- మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ 3 లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1200 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
- ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 1000 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.
- మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప సింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ 1100 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.