mt_logo

ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం దేశం ఇంకా చేరలేదు : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.

గత ఏడాది భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించు కుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 

75 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్య్రం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడం లేదు. అన్నీ ఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల  జీవితాల్లో అలుముకున్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్ని వర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్ర్యానికి సార్థకత అని సవినయంగా మనవి చేస్తున్నాను. దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో అహింసా యుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.  

సమైక్య పాలనలో తెలంగాణలోని అన్ని రంగాలు విధ్వంసమైపోయాయి. నాటి  తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ము కాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్క తాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. 

పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవన చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు  పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది. ఎటుచూసినా పడావు పడ్డ పొలాలు, పూడుకుపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి  దుబ్బ తేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరు కానరాని బోర్లు,  ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరెంటు షాకుకో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకు మీద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే  ముసలి వాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు. 

ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను  విజయవంతంగా వికాస పథం వైపు నడిపించింది.  

ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి  అనుగుణంగా అన్ని రంగాలను ప్రక్షాళన చేసింది. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో,  అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. “తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది” అనే దశకు చేరుకుని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు.