చైనాలో నేడు జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్ రోడ్స్ అనే అంశంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దంన్నర పాటు పోరాడామని, 15 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అప్పటినుండి ప్రజలు పూర్తి సంతోషంతో ఉన్నారన్నారు. మాది వేర్పాటు ఉద్యమం కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైంది.. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని, రెండు వారాల్లో అనుమతులు పొందే హక్కు పారిశ్రామికవేత్తలకు ఉండేలా ప్రత్యేక చట్టం రూపొందించామని, ఇప్పటివరకు 56 కంపెనీలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు.
భారతదేశంలో రాష్ట్రాలది కీలక పాత్ర అని, ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడిన నీతి ఆయోగ్ టీమిండియాగా పనిచేస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులంతా అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. రాష్ట్రాలకు కేంద్రం అధికంగా నిధులు, అధికారాలు ఇచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గొప్ప విజయం సాధించారు.. ప్రధాని సంస్కరణల దిశగా పయనిస్తున్నారు.. అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్ లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువని, భారత్ ఇదేవిధంగా ముందుకెళ్తుందన్న విశ్వాసం తమకు ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.