
భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది చాలా విశిష్టమైన సందర్భం. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాట చరిత్రనీ, స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం ప్రతి భారతీయుని బాధ్యత అని సూచించారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను ఆదర్శాలను, నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజుల పాటు నిర్వహించుకున్నాం అన్నారు. నేడు ముగింపు ఘట్టానికి చేరుకున్నాం.. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 30 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు.
సమాచార ప్రజా సంబంధాల శాఖ, విద్యాశాఖల అధికార సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. వారికి నా అభినందనలని పేర్కొన్నారు. భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు, ఉన్నతమైన నాగరికతకు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. అతి ప్రాచీన కాలంలోనే యావత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిదే అన్నారు.
భారతదేశాన్ని ఒక్కతాటి మీద నిలబెట్టింది స్వాతంత్ర సమరం
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్య్ర సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయింది. అనేక మంది మేధావులు దేశ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. స్వామి వివేకానంద భారత దేశ ఔన్నత్యాన్ని వివరించడం వల్ల భారతీయులలో జాతీయ స్పృహ రగిలిందన్నారు. బ్రిటిష్ పాలన మన దేశానికి లాభదాయకమని, బ్రిటిషర్లు మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారని నమ్మే దురాలోచనాపరులు ఆనాడు కూడా ఉండేవారు. విభిన్న సంస్కృతుల కలయిక అయిన భారతదేశాన్ని ఒక్కతాటి మీద నిలబెట్టింది స్వాతంత్ర సమరమని పేర్కొన్నారు.
ఆనాడు మహాత్మా గాంధీ వంటి మహనీయులు ఎంతో శ్రమకోర్చి, దేశ ప్రజలందరిలోనూ భారతీయ భావనను పాదుకొల్పారు. రెండు శతాబ్దాల పరాధీనత నుండి విముక్తి కోసం జరిగిన సమరంలో ఎంతో నెత్తురు ధారపోయాల్సి వచ్చింది. ఎందరో ప్రాణాలను బలిపెట్టవలసి వచ్చిందన్నారు. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వంటి అనేకమంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది.
‘‘మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను’’ అని పిలుపునిచ్చి సాయుధ సమరాన్ని నడిపారు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికీ మనందరికీ గొప్ప ప్రేరణనిస్తుందని గుర్తు చేసారు. ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ అగ్రగణ్యులు. యుద్ధాలతో కొట్టుకుచస్తున్న మానవ జాతికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం చేసాడు గాంధీ.
గాంధీజీ చరఖా చేత బట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికివాడలు శుభ్రం చేసినా, ఉప్పు వండినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. ‘‘ ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ ’’ అంటూ మత సామరస్యం కోసం యావజ్జీవం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం చారిత్రక విషాదం. గాంధీజీ ఒక్క భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారని తెలిపారు.
మార్టిన్ లూథర్ కింగ్ నుంచి, నెల్సన్ మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచిందన్నారు. గాంధీని ఎంతగానో ఆరాధించిన నెల్సన్ మండేలా ఈ విధంగా అన్నారు. “నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమలో మహాత్మా గాంధీ యొక్క స్థాయిని నేనెప్పటికీ అందుకోలేకపోయాను. గాంధీ ఏ బలహీనతలు లేని మనిషి. నేను అనేక బలహీనతలున్నవాడిని..” అని మండేలా చెప్పుకున్నారు. నేటికీ యావత్ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తున్నది.
గాంధీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్రోద్యమం విజయ తీరం చేరింది. స్వాతంత్ర సమర ఆశయాల వెలుగులోనే అంబేద్కర్ మహాశయుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలకు వేదికగా నిలుస్తున్నదన్నారు.
గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. పోరాటం గమ్యాన్ని ముద్దాడింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేది. బీఆర్ఎస్ను స్థాపించినపుడు అహింసాయుత ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను స్పష్టంగా ప్రకటించాను. మొదట కొందరు నాతో ఏకీభవించలేదు. కానీ రానురాను అందరూ నేను ఎంచుకున్న మార్గమే సరైనదని అంగీకరించారు. వెంట నడిచారు. ప్రాణాన్ని పణంగా పెట్టయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప, అహింసామార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నాను.
ఆ నేపథ్యంలోంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన.. స్వతంత్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందని అన్న ప్రబుద్ధుల వంటివారు… తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారు. వారు తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలం కాక తప్పలేదు. విచిత్రం ఏమిటంటే… వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనది అయినట్టే.. తెలంగాణ పరిపాలన కూడా స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణమైనదే. స్వతంత్ర భారతంలో ఏనాడూ లేని విధంగా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాం. రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతన్నల కళ్లలో వెలుగులు చూస్తున్నాం. గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయం పోషకత్వం దిశగా మనం ఎంతో దూరం ప్రయాణించాం గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహమిచ్చాం. గ్రామాలు సుసంపన్నంగా మారాయన్నారు.
ప్రజలందరికీ మంచినీళ్ళు కూడా ఇంతకాలం ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. సంక్షేమానికి అగ్ర తాంబూలం మివ్వడంలోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికల రచన చేయడంలోనూ, గ్రామీణ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీ ప్రభావమే ఉన్నది. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని గాంధీ పదే పదే చెప్పారు కదా.. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నామ్మన్నారు.
ఈరోజు తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచి
గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా, వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధి దాకా, గిరిజనులు, దళితులు, మైనార్టీలు మొదలుకొని… అగ్రవర్ణ పేదల దాకా అన్నిటికీ, అందరికీ సమ ప్రాధాన్యత స్తున్నాం అని తెలిపారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి నమూనాతో పురోగమిస్తున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా నిలిచింది.
సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం
ఈ అభివృద్ధి నమూనా ఇదేవిధంగా కొనసాగిస్తూ, సకల జనులకూ ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతామని సవినయంగా తెలియజేస్తున్నాను. మనది న్యాయపథం.. మనది ధర్మపథం. సకలజనుల సంక్షేమమే మనకు సమ్మతం. సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం. మన నిబద్ధతా, నిజాయితీ జనావళికి అభయం. ముమ్మాటికి మనలనే వరిస్తుంది విజయం..ఇది సత్యం, ఇది నిత్యం, ఇది తథ్యం…స్వాతంత్య్ర సమర యోధుల ఆశయాలను నిజం చేద్దాం అన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదాం అని అన్నారు.