
కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు పనికిరావు అని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ల చరిత్రలు కూడా మీకు తెలుసని అన్నారు. బీఆర్ఎస్ ఈ పదేండ్లలో చేసిన అభివృద్ధి తెలుసు, అద్భుతంగా ఉన్నటువంటి తెలంగాణను ఆంధ్రాలో జబర్దస్తీగా కలిపి నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. పైన సింగూర్ ప్రాజెక్టును కట్టి నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎండబెట్టి, రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
నిజాంసాగర్ కింద పంటలు పండి రైతుల జేబులు గలగలలుగా ఉంటేనే, నిజామాబాద్లో ఉన్న సేఠ్ల గల్లాలు కూడా గలగలగ ఉంటయని అన్నారు. నిజాంసాగర్ రైతులను నాడు కాంగ్రెస్ బాధలు పెడితే.. నేడు బీఆర్ఎస్ సర్కారు నిజాంసాగర్ ను నిండు కుండలా మార్చి జలకళ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. 365 రోజులు నిజాంసాగర్ నీటితో నిండి ఉండేలా చేసినం. మళ్లీ నిజామాబాద్ జిల్లా కళకళలాడుతూ నంబర్ వన్ జిల్లాగా ఉంటదన్నారు.
కేసీఆర్ బతికున్నన్నాళ్లూ సెక్యులర్గానే ఉంటడని హామీ ఇచ్చారు. హిందూ, ముస్లిం తేడా లేకుండా మనందరం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం.. బీజేపీ మత పిచ్చితో మంటలు పెట్టేటటువంటి పార్టీ. ప్రజలను విభజించే పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. ప్రధాని మోదీకి వంద ఉత్తరాలు రాసినా ఒక్కటంటే ఒక్కటి కూడా మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.
వందసార్లు అడిగినా మోదీ ఒక్క నవోదయ పాఠశాలను కూడా ఇవ్వలేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు పనికిరావు, 2024 తర్వాత దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తది. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే ఉంటది. మన సత్తా చాటాలని కోరారు. పెద్ద మనసుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తాను గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాని పేర్కొన్నారు.