mt_logo

తలాపునే గోదారి ఉన్న చుక్క నీరియ్యని చరిత్ర కాంగ్రెస్‌ది: సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ ప్రజల కోసమని సీఎం కేసీఆర్ తెలిపారు. మీ కండ్ల ముందరే పుట్టింది బీఆర్ఎస్ అని  పేర్కొన్నారు. మంచిర్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ.. 15 సంవత్సరాలు మడమ తిప్పకుండా పోరాటం చేసి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వ‌జ‌మెత్తారు. 

మంచినీళ్లు కూడా ఇయ్యలే.. 

మన తెలంగాణ మనకే ఉండే. 1956 లో వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పుకు 58 ఏండ్లు మనం గోస అనుభవించినం. పడరాని పాట్లు పడ్డం. అన్నిటీకీ బాధలే.. మంచినీటి గోస, సాగునీటి గోస, కరెంటు గోస, సింగరేణిని ముంచిండ్రు. అన్నిరకాలుగా ఏడిపించారని అన్నారు. మీ కండ్ల ముందు జరిగిన చరిత్రనే ఇది అని పేర్కొన్నారు. రామగుండం పక్కన ముర్ముర్‌లో ఉండేటువంటి ఓ కవి రాశారు… తలాపునే పారుతుంది గోదారి.. మన చేను మన చెల్క ఎడారి. గోదావరి ఉంటది కానీ చారెడు నీళ్లు మనగడ్డమీదికి రావు. మంచినీళ్లు కూడా ఇయ్యలే కనీసం అని ఆవేదన వ్యక్తం చేసారు. గోదావరి ఒరుసుకుని పారే ప్రాంతంలో  కూడా సరియైనటువంటి మంచినీళ్లు కూడా అందించలేకపోయినారు. అంత గోసపడ్డాం అని తెలిపారు. 

డిపెండెంట్ ఉద్యోగాలకు మంగళం

సింగరేణి.. సింగరేణి నిజాం కాలంలో 134 ఏండ్ల కింద స్టార్ట్ అయిన కంపెనీ సింగరేణి అని గుర్తు చేసారు. 100 శాతం మన రాష్ట్ర కంపెనీ అది.  ఈ కాంగ్రెస్ దద్దమ్మలు రాజ్యమేలినపుడు వాళ్లు చేతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 49 శాతం వాటా సింగరేణిల పుట్టించిండ్రు.. కేంద్రానికి.. అప్పు తిరిగి కట్టలేక..అందువల్ల వాళ్లకు వాటా వచ్చింది. 51 శాతం మనకుంచిండ్రు. కాంగ్రెస్ పార్టీ, సీపీఐ వాళ్లు కలిసి డిపెండెంట్ ఉద్యోగాలకు మంగళం పాడింది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించుకున్నం అని తెలిపారు. 

సింగరేణి కార్మికులకు పాపం దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు ఉండే..

15000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నం. ఎవరైనా ఉద్యోగం తీసుకోకపోతే 25 లక్షల రూపాయలు ఇస్తున్నం. సింగరేణి కార్మికులు ఇళ్లు కట్టుకుంటే 10 లక్షల రూపాయలిచ్చి వడ్డీ లేని రుణమిస్తున్నం. ఇలా అనేక సదుపాయాలు చేశాం అని సూచించారు. సింగరేణి కార్మికులు పాపం దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్టుగా ఉంటరు. వాళ్లకి  ఇన్ కం ట్యాక్స్ మాఫీ చేయాలంటూ మోదీకి అసెంబ్లీల తీర్మానం చేసి ఎప్పుడో పంపించాం. కానీ మోడీ చేస్తలేడని ధ్వజమెత్తారు. దివాకర్ రావుని గెలిపించుకుంటే మీకు మంచి లాభం జరుగుతుంది.. గెలిపించాలనని విజ్ఞప్తి చేసారు.