mt_logo

నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా సునీత లక్ష్మారెడ్డి.. మెదక్ ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందచేశారు. అదే సందర్భంగా ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల  సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…‘‘ మదన్ రెడ్డి గారు నాతో పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు, 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడని తెలిపారు. నాకు కుడి భుజం లాంటి వాడని గర్వించారు. సోదర సమానుడు. పార్టీ  ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలు మీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుందన్నారు. ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుంచి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటీని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ ముఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 

మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్‌లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాదరహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. నాతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించిందన్నారు. చిన్న చిన్న సర్దుబాటు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు ’’ అని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు.