mt_logo

అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత ‘రైతు’ సమితి పోరాడుతూనే ఉంటది: కేటీఆర్

తెలంగాణలో రైతులు అనుభవిస్తున్న కష్టాలు, వారి సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.

ముఖ్యమంత్రి గారు.. రైతులంటే మీకు ఎందుకింత చిన్నచూపు.. నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు.. నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు అని అన్నారు.

ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా.. అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా.. ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు

సీట్లు, ఓట్ల పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా.. ప్రజా పాలన అంటే 24/7 ఫక్తు రాజకీయమేనా.. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు.. పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా అని ఘాటుగా విమర్శించారు.

హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా.. ఇంతకాలం.. పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు. ఇప్పుడు..నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా.. గుర్తు పెట్టుకోండి.. ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్సిన రాజ్యం బాగుండదు అని హెచ్చరించారు.

అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత ‘రైతు’ సమితి పోరాడుతూనే ఉంటది అని కేటీఆర్ పేర్కొన్నారు.