mt_logo

నిరుద్యోగుల సమస్యలు, పార్టీ ఫిరాయింపులపై గవర్నర్‌కి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ బృందం

పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తదితర అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ రాధాకృష్ణన్ గారి దృష్టికి తీసుకెళ్లాం అని తెలిపారు.

మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న నాయకులందరం గవర్నర్ గారిని కలవటం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కుతున్నదో ఆయకు వివరించటం జరిగింది. హామీలు అమలు చేయాలన్న విద్యార్థుల మీద నిర్భంధం, అణిచివేత, అరెస్ట్‌లు, అక్రమ కేసులతో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పాం అని అన్నారు.

సిటీ సెంట్రల్ లైబ్రరీలో లాఠీ ఛార్జ్, ఓయూ విద్యార్థులపై దాడి చేస్తూ ఉద్యమ నాటి అణిచివేత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ప్రయోగిస్తుందని ఆయన దృష్టికి తెచ్చాం. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి వాళ్లిచ్చిన ప్రకటనలు, హామీలను గవర్నర్ గారి తెలిపాం. గ్రూప్ 1, 2, 3 కి సంబంధించి పోస్టులు పెంచుతామన్న హామీ పట్టించుకోవటం లేదన్నది వివరించాం అని తెలిపారు.

గవర్నర్ గారు చాలా సీరియస్‌గా ఈ అంశాలపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని చెప్పారు అని కేటీఆర్ పేర్కొన్నారు.

రెండో అంశం రాష్ట్రంలో ఏ విధంగా రాజ్యాంగ హననం జరుగుతుందో కూడా గవర్నర్ గారికి చెప్పాం. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సంగతి ఆయనకు తెలిపాం. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని.. స్పీకర్ గారికి కూడా ఫిర్యాదు చేశామని ఆయనకు వివరించాం అని తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. నిరుద్యోగుల విషయంలో ఆయన చాలా సీరియస్‌గా స్పందించిన తీరుకు అభినందనలు. ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్ గారికి వివరించాం. ఎమ్మెల్యేల హక్కులకు భంగం వాటిల్లవద్దని ఆయన అన్నారు.. దీనిపై కూడా ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని లేఖ రాస్తా అని చెప్పారు అని అన్నారు.

భవిష్యత్‌లో విపక్షాలుగా ఎలాంటి ఇబ్బంది వచ్చిన తనను కలవాలని ఆయన కోరారు. తన పరిధిలో ఉన్న అంశాల్లో తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఓ వైపు రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు రాహుల్ గాంధీ ఫోజులు కొడుతూ.. మళ్లీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న వ్యవహారాన్ని గవర్నర్ గారి దృష్టికి తెచ్చాం. కాంగ్రెస్ చేస్తున్న రాజ్యాంగ విరుద్దమైన పనులకు సంబంధించిన గవర్నర్ గారికి మాత్రమే కాదు. రాష్ట్రపతి గారికి కూడా ఫిర్యాదు చేస్తాం అని ఈ సందర్భంగా చెప్పారు.

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీగా అండగా ఉంటుంది. వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు.

ఇక మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అయ్యిందంటూ చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారు. కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి అయ్యాయి. ఇప్పుడు వరదలాగ నీళ్లు వస్తున్న మేడిగడ్డ తట్టుకోవటమంటే అదే కాళేశ్వరం గొప్పతనం. త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తాం.. ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం అని కేటీఆర్ అన్నారు.

పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని సీఎం అన్నారు. ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారు. 4 వందల కోట్ల రూపాయలు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత? అని అడిగారు.