ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ఎన్నారైలు 30 మంది కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ వేడుకలకు సుమారు 600 మంది హాజరయ్యారు. మహిళలంతా కలిసి బతుకమ్మ, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. ఈసందర్భంగా పిల్లలకు బతుకమ్మ పండుగ ప్రాశస్త్యం వివరించారు. దుర్గామాత పూజతో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ, దాండియా వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
యూకే నుంచి వచ్చిన సింగర్ స్వాతిరెడ్డి బతుకమ్మ పాటలు పాడి అలరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఐర్లాండ్లోని పిల్లలకు తెలియజేయాలనే లక్ష్యంతో తెలంగాణ ఎన్నారైల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మను పేర్చి అక్కడికి తీసుకువచ్చి.. బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకునే ప్రతి ఆడపడుచుకు బహుమతిని ప్రదానం చేస్తారు. ఈ వేడుకల్లో డబ్లిన్ ప్రాంతీయ ఎంపీలు రుత్ కొపింగర్, జాక్ చాంబర్స్, కౌన్సెలర్ మేరీ మెక్ కామ్లేతో పాటు డబ్లిన్ ప్రాంత వాసులు, తెలంగాణ ఎన్నారైలు పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు. బతుకమ్మ వేడుకలకు వచ్చిన అతిథులకు రుచికరమైన వంటలు, ప్రసాదం వడ్డించారు.
బతుకమ్మ వేడుకల్లో వాలంటీర్లు నవీన్ గడ్డం, శ్రీనివాస్ కార్పే, సాగర్, ప్రబోధ్ మేకల, జగన్ రెడ్డి మేకల, కమలాకర్ కొలన్, సంతోశ్ పల్లె, రవీందర్ రెడ్డి చప్పిడి, రాజేశ్ ఆది, దయాకర్ రెడ్డి కొమురెల్లి, శ్రీనివాస్ పటేల్, సుమంత్ చావా, అల్లే శ్రీను, నగేశ్ పొల్లూరు, త్రీశిర్ పెంజర్ల, ప్రదీప్ యల్క, ప్రవీణ్ లాల్, వెచ్చ శ్రీను, వెంకట్ తీరు, సునీల్ పాక, అల్లంపల్లి శ్రీనివాస్, షరీష్ బెల్లంకొండ, శ్రీకాంత్ సంగిరెడ్డి, రమణ యానాల, రామ్రెడ్డి, వెంకట్ గాజుల, వెంకట్ జూలూరి, వెంకట్ అక్కపల్లి, నవీన్ జనగాం, రాజారెడ్డి పాల్గొన్నారు.