mt_logo

హైదరాబాద్ నగరానికి మరో భారీ పెట్టుబడి

•యూకేకి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ నగరంలో టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు నిర్ణయం

•గత నెల యూకేలో మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సంస్థ ప్రతినిధులు

•హైదరాబాద్ లో  పర్యటించి, ఐదు వారాల్లోనే టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న లాయిడ్స్ 

•తొలుత 600 మందికి ఉద్యోగ అవకాశాలు

•సంస్థ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. యూకేకు చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ లో తన టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నది. గత నెల తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు తో జరిగిన సమావేశం అనంతరం ఐదు వారాల్లోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకుంది. వ్యాపార అనుకూలతలు, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని లాయిడ్స్ బ్యాంక్ తెలిపింది. ఆర్థిక సేవలు అందించడంలో యూకే లో టాప్ పొజిషన్ లో ఉన్న లాయిడ్స్ బ్యాంకు కి దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు లాయిడ్స్ తెలిపింది. 

టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో గొప్పగా ఎదుగుతున్న హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు దీర్ఘకాలం పాటు సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని లాయిడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కేమెనడే తెలిపారు. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుతో తమ సంస్థకు మరిన్ని అవకాశాలు కలుగుతాయన్న  విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన, హైదరాబాద్ లో ఉన్న అద్భుత మానవ వనరులు, వారి నైపుణ్యం, ఇన్నోవేషన్ రంగంలో ఉన్న వారి ప్రతిభ తమ సంస్థ పురోగతికి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

హైదరాబాద్ లో లాయిడ్స్ బ్యాంక్  టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుపై మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. లాయిడ్స్ బ్యాంక్ గ్రూప్ కు మంత్రి సాదర స్వాగతం పలికారు. యూకేలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో గత నెల సమావేశం అయిన అనతికాలంలోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషాన్ని ఇస్తుందన్నారు. హైదరాబాద్ లో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో ఉన్న ఈకో సిస్టంతో టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు లాయిడ్స్ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సుమారు 600 మందిని తొలి ఆరు నెలల్లో ఉద్యోగాల్లోకి తీసుకొనున్నదని, తర్వాత ఈ సంఖ్యను పెంచుతుందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని బిఎఫ్ఎస్ఐ ఈకో సిస్టంకు లాయిడ్స్ బ్యాంక్ టెక్నాలజీ సెంటర్ మరింత బలోపేతం చేస్తుందన్నారు కేటీఆర్.