mt_logo

స్వాతంత్రోద్యమ చరిత్రలో అల్లూరి అమరత్వం అజరామరం : సీఎం కేసీఆర్

దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం  తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పరాయి పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్రోద్యమ చరిత్రలో వారి అమరత్వం అజరామరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి (జులై 4) ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం నాడు హైదరాబాద్ లో జరుగుతున్న సందర్భంగా దేశం కోసం వారు చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.   గిరిజనుల హక్కుల సాధన కోసం నాటి పరాయి పాలకులైన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లూరి ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమైనవన్నారు. 

సీతారామ రాజు వంటి వీరుల స్ఫూర్తి తో ఎందరో దేశ పౌరులు నాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.  భారత రాష్ట్రపతి పాల్గొంటున్న, చారిత్రక సందర్భమైన అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో నిర్వహించుకోవడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రజల కోసం పోరాడే త్యాగధనుల జీవితాలు విశ్వజనీనమైన స్పూర్తిని పంచుతాయని, వారి త్యాగాలను స్మరించుకుంటూ రేపటి తరాలు ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ తెలిపారు.