జగిత్యాల : జగిత్యాల్ జిల్లా కొండగట్టులో కొలువై ఉన్న ఆంజనేస్వామి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తరువాత, అక్కడ నిర్వహించిన హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. కరోనా కష్టసమయంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని కొండగట్టు ఆలయ పూజారి జితేంద్రయ్య సూచించారు. ఆంజనేయ స్వామి పారాయణానికి మించిన మందు లేదు అని ఆయన చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు కొండగట్టు అంజన్న సేవా సమితి పేరుతో జితేంద్రయ్య నేతృత్వంలో అందరం పారాయణం చేస్తున్నామన్నారు. అలాగే మంచి జీవితాన్ని ప్రసాదించేటటువంటి, ఆనందాన్ని,ఇచ్చేటటువంటి, విజయాన్ని అందించే ఆంజనేయ స్వామిని కొలిచినట్టు అయితే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని మనందరం బలంగా నమ్ముతామన్నారు. అందుకే తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి ఉంటుందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు .