mt_logo

9 ఏళ్లలో మైనారిటీల అభ్యున్నతికి రూ. 10 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ సర్కార్

9 ఏళ్లలో  2 లక్షల 68 వేల మందికి షాది ముబారక్ పథకం క్రింద పెళ్లిళ్లకు రూ. 2,258.17 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది

హైదరాబాద్:  రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధి కోసం బడ్జెట్ లో పెద్ద మొత్తంలో కేటాయింపులు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క 2023 – 2024 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం  రూ. 2200.33 కోట్లను కేటాయించింది. వారికి ఆర్థిక చేయూతనిచ్చేలా పథకాల రూపకల్పన చేసింది. విదేశాల్లో చదువుకునే మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ప్రోత్సాహకాలు అందింస్తుంది. మైనారిటీ యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లతో పాటు తెలంగాణ స్టేట్ మైనారిటీ స్టడీ సర్కిల్‌లను నిర్వహిస్తోంది. షాదీ ముబారక్ పేరిట ముస్లిం పెద ఆడపిల్లల పెళ్లిల్లకు గడిచిన 9 ఏళ్ళలో  2 లక్షల 68 వేల మందికి రూ. 2,258.17 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది ఆర్థికంగా చేయూత నిచ్చింది. క్రిస్టియన్ మైనారిటీలకు క్రిస్టియన్ భవన్ నిర్మించుకునేందుకు ఉప్పల్ భాగ్ హయత్ లో 2 ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి అయ్యే నిధులును సమకూర్చింది.

షాది ముబారక్‌తో సంతోషాల వెల్లువ:

ఆర్థిక స్థితిగతుల కారణంగా ముస్లిం మైనారిటీలు వారి ఆడపిల్లల  వివాహాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం షాదిముభారఖ్ స్కీం ను ప్రకటించింది. ఈ పథకం ద్వారా 2014 సంవత్సరంలో ప్రతి ఆడపిల్ల వివాహానికి రూ. 51 వేల రూపాయలను ఆర్ధిక సాయంగా అందించింది. ఆ మొత్తం కూడా వివాహ ఖర్చులకు సరిపోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం దశల వారిగా ఆ మొత్తాన్ని రూ.1,00,116 లకు పెంచింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి 2023 సంవత్సరం వరకు షాది ముభారక్ క్రింద 2,68,230 మంది లబ్ధి పొందారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ. 2465 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

స్వయం ఉపాధికి రూ.1 లక్ష సహాయం:

నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న మైనారిటీ యువతకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో మైనారిటీ నిరుద్యోగులకు వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి కల్పించుకునేలా తయారు చేస్తోంది.  నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ యువత స్వయం ఉపాధి కోసం వంద శాతం సబ్సిడీతో  లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. 2023 – 2024 సంవత్సరం నాటికి రూ.554.07 లక్షల రూపాయలు వెచ్చించి 3110 మంది క్రిస్టియన్ మైనారిటీ యువకులకు ఐటీ మరియు ఇతర రంగాలలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించింది. ఓన్ యువర్ ఆటో పేరిట రూ.12.76 కోట్ల సబ్సిడీతో 1744 మంది మైనారిటీ నిరుద్యోగులకు ఆటోలను అందచేసింది. డ్రైవర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం ద్వారా రూ.31.97 కోట్ల సబ్సీడితో 709 మందికి క్యాబ్‌లను అందచేసింది. మైనారిటీ మహిళల స్వయం ఉపాధి కోసం రూ. 8.03 కోట్ల వ్యయంతో 10,072 కుట్టు మిషన్లను పంపిణీ చేసింది.

రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటీ స్టడీ సర్కిల్ ద్వారా నాణ్యమైన విద్యా బోధన:

మైనారిటీ యువకులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు రాష్ట్రంలోని 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా మార్చింది. ఈ కళాశాలలకు రూ.788.66 కోట్ల రూపాయలు మంజూరు చేయగా రూ.649.07 కోట్లు ఖర్చుచేసింది. ఈ కళాశాలలో మైనారిటీ విద్యార్థులకు విద్య, నివాస, భోజన వసతులు కల్పిస్తారు.  ఉన్నత విద్య అనంతరం  ప్రభుత్వ,  ప్రైవేటు రంగ పోటీ పరీక్షలకు మైనారిటీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తారు. మైనారిటీ స్టడీ సర్కిల్ ద్వారా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2023 వ సంవత్సరం  వరకు 9319 మంది విద్యార్థులు శిక్షణ పొందారు. ప్రతీయేట మైనారిటీ స్టడీ సర్కిల్ నిధుల ద్వారా 100 మంది విద్యార్థులు పేరుగాంచిన ఐఏఎస్ స్టడీసర్కిల్‌లలో శిక్షణ పొందుతున్నారు.

ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీం:

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ యువకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్ధికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఒక వైపు విమాన ప్రయాణ ఖర్చులను 60 వేల రూపాయలకు మించకుండా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 2023 సంవత్సరం వరకు 2210 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. 2023 – 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 118 కోట్లను కేటాయించగా రూ. 59 కోట్లను ఖర్చు చేసింది.

పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు:

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మైనారిటీల సంక్షేమం కోసం  ప్రభుత్వం ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయి అధికారులు సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తారు. అర్హులైన వారికి పథకాలు అందేలా చూస్తారు. అవగాహన లేని వారికి అవగాహన కల్పించి వారు సంక్షేమ ఫలితాలు పొందేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ఈ సంక్షేమ పథకాలు అందేలా ఉన్నతాధికారుల బృందం పర్యవేక్షణ చేస్తుంది. ఈ కమిషనరేట్ మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తుంది.

అనీస్ ఉల్ ఘుర్భా భవన నిర్మాణం :-

ముస్లిం అనాథల కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 39 కోట్లతో అనీస్ ఉల్ ఘుర్భా భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.

అజ్మీర్‌లో రుబాత్ (అతిథి గృహం) :-

ముస్లింల పవిత్ర దర్గా రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద తెలంగాణ నుంచి సందర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రుబాత్ (అతిథి గృహం) నిర్మించేందుకు రూ. 5 కోట్లు కేటాయించింది. భూమి సమీకరణకు సంబంధించి అజ్మీర్ డెవలప్ మెంట్ అథారిటీని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించింది.

ఇమాం మౌజంలకు గౌరవ వేతనం  :-

ముస్లింల ప్రార్థనా స్థలాలు అయిన మసీదులు, మదర్సాల్లో ఉండే ఇమామ్, మౌజంలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5,000 ల గౌరవ వేతనాన్ని అందిస్తున్నది. రాష్ట్రంలోని 10 వేల మందికి ఈ గౌరవ వేతనాన్ని  అందిస్తూ సమాజంలో వారికి గౌరవప్రదమైన హోదాను, గౌరవాన్ని కల్పిస్తున్నది.

ఇతర కార్యక్రమాలు :-

  • పాతబస్తీలోని మక్కా మసీదు మరమ్మత్తులు, పునరుద్ధరణ, నవీకరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 8.48 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి.
  • మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న కొత్తూర్ లోని జహంగీర్ పీర్ దర్గా సమగ్రాభివృద్ధికి అవసరమైన భూసేకరణ కోసం  తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్లను ఖర్చు చేసింది.  
  • హైదరాబాద్ లోని కోకాపేట్ లో బర్హానా షా సాహిబ్ ఖిబ్లా పరిసరాల్లో ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, మహిళా సాధికారత కేంద్రం స్థాపనకు ప్రభుత్వం రూ. 20 కోట్లను మంజూరు చేసింది. 
  • హైదరాబాద్ లోని కోకాపేటలో రూ. 40 కోట్లతో తెలంగాణ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ స్థాపనకు రూ. 40  కోట్లు మంజూరు చేశారు. 
  • డ్రైవర్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రామ్ కింద మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్‌లు 941 కార్లను మైనార్టీలకు పంపిణీ చేశాయి. 
  • రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 12, టీచర్ల సంఖ్య 258, విద్యార్థుల సంఖ్య 5760 ఉండగా, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 192 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళను స్థాపించడంతో పాటు 5,862 మంది టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్య 204 కాగా, టీచర్ల సంఖ్య 6120 మొత్తం 97,920 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 

రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కేవలం 2 మాత్రమే ఉండేవి. వీటిలో విద్యార్థుల సంఖ్య 320 ఉండగా, 28 మంది టీచర్లు పనిచేసేవారు.  తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 202 మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలను స్థాపించడంతో పాటు 1,616 మంది టీచర్లను నియమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల సంఖ్య 204 కాగా, వీటిలో టీచర్ల సంఖ్య 1644 గా ఉంది. 32,640 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చదువుకుంటున్నారు.