mt_logo

కేసీఆర్‌దే రియల్‌ విజన్‌ :వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

అతి తక్కువ సమయంలో రూ.650 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ కట్టి చూపించిన తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ హీరో అంటూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు.  మహారాష్ట్రలోని ప్రజలు, రైతులు అయితే.. మాకు కూడా తెలంగాణ పథకాలు కావాలని కోరుతున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ను ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేశారు. రైతులు ఇబ్బందులు పడొద్దని సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలోనే నిర్మించిన కేసీఆర్. తాజాగా సెక్రటేరియట్‌ను అద్భుతంగా కట్టడం..కేసీఆర్‌ది రియల్‌ విజన్‌ అని కొనియాడారు.  పక్క రాష్ట్రం సీఎం అయినా కేసీఆర్‌ను తాము కచ్చితంగా పొగుడుతామని స్పష్టంచేశారు.  

విజనరీ అని చెప్పుకొంటున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఓ డూప్లికేట్‌ అని మండిపడ్డారు. చంద్రబాబుకు ఐదేండ్ల సమయం ఉన్నా రూ.1200 కోట్లు ఖర్చుపెట్టి సెక్రటేరియట్‌ పేరుతో రేకుల షెడ్లు వేశారని, వానొస్తే నీళ్లు లోపలికి వస్తున్నాయని, బాత్రూంలు కూడా లేవని దుయ్యబట్టారు. రాజధాని, సెక్రటేరియట్‌ పేరుతో రూ.15 వేల కోట్ల ఫండింగ్‌ చేసి తాత్కాలిక భవనాలు కట్టి భూమిలో నీళ్లు పోసినట్టు పైసలు ఖర్చుపెట్టారని మండిపడ్డారు. ఎప్పుడూ ఒరిజనల్‌ లేదు అని అన్నారు.