mt_logo

ఢిల్లీ బసంత్ విహార్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం

నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు

బసంత్ విహార్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం (బీఆర్ఎస్ భవన్)

వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం అత్యంత వైభవోపేతంగా నిర్మితమైన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం

ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడాది ప్రారంభించిన నాలుగు అంతస్తుల బీఆర్‌ఎస్‌ పార్టీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా, రైతు రాజ్య స్థాపనే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఢిల్లీలోని బసంత్ విహార్ లో మే 4 (గురువారం)న అత్యంత అట్టహాసంగా ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ఉనికిలోకి రానుండటంతో బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త విస్తరణ వేగవంతం కానున్నది. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా…. అత్యంత ప్రామాణికమైన వాస్తుశాస్త్ర సూత్రాలను అనుసరించి నిర్మించిన కార్యాలయంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి అడుగుపెట్టనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు ఢిల్లీ బీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ వివరాలు:

నాలుగు అంతస్తులతో, 11 వేల చదరపు అడుగుల స్థలంలో బీఆర్ఎస్ భవన్ నిర్మించబడింది. లోయర్ గ్రౌండ్ లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి.గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్ , రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్ లు నిర్మించారు.
మొదటి అంతస్తులో లో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి.
2,3 వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు, వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.