mt_logo

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తాం: కేటీఆర్

రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమరజ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా రేపు రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపాలని కోరారు.

మొత్తం తెలంగాణ సమాజమంతా తెలంగాణ తల్లి విగ్రహాం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటమేమిటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. వెంటనే రేవంత్ రెడ్డి తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకోవాలనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణ తల్లి విగ్రహాం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సచివాలయం, అమరజ్యోతి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాం ఉండాలని కేసీఆర్ గారు 2023 జులైలోనే ఈ స్థలాన్ని ఎంపిక చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.

యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా గౌరవించుకునేందుకు కేసీఆర్ గారు ఎంపిక చేసిన స్థలానికి ఆమోదముద్ర వేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసిందన్నారు.

కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణ వ్యక్తి మనసును గాయపర్చేలా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాం కోసం కేటాయించిన ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సకల మర్యాదలతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తామని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ తల్లి విగ్రహాం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని తాము ముందునుంచే చెప్పామని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సరిగ్గా ఇప్పుడు అదే పనిచేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేవలం ఢిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణను ఆత్మను తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనోభావాల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ బాసుల మెప్పు పొందటమే ముఖ్యమైపోయిందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చర్యను యావత్తు తెలంగాణ సమాజం చీదరించుకుంటున్న సిగ్గులేకుండా తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా కూడా కాంగ్రెస్ నాయకులకు స్వప్రయోజనాలే ముఖ్యమైపోయాయన్నారు. తెలంగాణ ఉద్యమకారులమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి గులామ్ లేనని తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలా? ఢిల్లీ బాసులా? అంటే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీ బాసులకే జీ హుజూర్ అంటారన్న విషయం మరోసారి స్పష్టమైందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ అస్తితత్వం తో పెట్టుకున్న వాళ్లెవరు రాజకీయంగా బతికి బట్టకట్టలేదని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. ప్రాంతం వాడే మన అస్తిత్వతాన్ని దెబ్బ తీస్తుంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు వారికి రాజకీయంగా సమాధవ్వటం ఖాయమని చెప్పారు.

తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఢిల్లీ బాసుల మెప్పు కోసం కాకుండా.. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ముందు నిలబడుతుందన్నారు. ఖచ్చితంగా తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్షగా నిలుస్తుందని స్పష్టం చేశారు.