mt_logo

కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు కాపాడటం కోసం ఎంతకైనా పోరాడుతాం: కేసీఆర్

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ.. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని స్పష్టం చేశారు.

నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబికి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా నదిపై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి తలెత్తే నష్టాలు పర్యవసానాలు పై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీటి హక్కులకోసం పోరాడడమే కాకుండా ‘మా నీళ్లు మాకే’ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలంలోనే నిజం చేసి చూయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

కేఆర్ఎంబి పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడుతామన్నారు.

తద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణకు రావలసిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం తీర్మానించింది.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జి జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.