mt_logo

దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణాపాయం లేదు : మంత్రి వేముల

  •  చందూర్ శివారులో జరిగిన ప్రమాద ఘటన దురదృష్టకరం
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం
  • దేవుడి దయ వల్ల ఎవరికి ప్రాణాపాయం లేదు
  • గాయపడిన వారిని పరామర్శించి,మనోధైర్యం చెప్పాం
  • ఫ్యాక్చర్ అయిన నలుగురికి సర్జరీ చేసే అవకాశం ఉన్నది
  • స్వల్ప గాయాలై కోలుకున్న 15 నుంచి 20 మందిని ఇవాళ,మరో 6 గురిని రేపు డిశ్చార్జ్ చేస్తాం
  • అందరికీ రవాణా సదుపాయం ఏర్పాటు చేశాం.. వాళ్ల ఇండ్లకు క్షేమంగా చేర్చే బాధ్యత మాదే
  • ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాగం స్పందించింది
  • సకాలంలో వైద్యం అందేలా చూసిన వైద్యులకు,పోలీసులకు,ఇతర అధికారులకు ధన్యవాదాలు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

నిజామాబాద్: బడాపహాడ్ దర్గాకు వెళ్తూ ప్రమాదానికి గురై నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం మానాలా వాసులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం నాడు పరామర్శించారు.  హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రతి బెడ్ తిరుగుతూ బాధితులకు మంత్రి మనో ధైర్యం చెప్పారు. మీకు ఏమి కానివ్వం,అన్ని విధాల అండగా ఉంటానని భరోసా కల్పించారు. మేజర్ ఇంజూరి అయిన వారి చికిత్స రిపోర్ట్స్ తనకు పర్సనల్ గా పంపాలని వైద్యులకు సూచించారు.

ఇండ్లకు క్షేమంగా చేర్చే బాధ్యత మాదే

అనంతరం అక్కడకు వచ్చిన మీడియాతో మంత్రి మాట్లాడుతూ…బాల్కొండ నియోజకవర్గం మానాల గ్రామానికి చెందిన సుమారు 50 మంది బడా పహాడ్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న డీసీఎం దురదృష్టవశాత్తు బోల్తాపడి ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాగం సకాలంలో అప్రమత్తం అయిందన్నారు. లోకల్ పోలీస్ వారు అంబులెన్స్ వచ్చే ఏర్పాట్లు చేయడంతో పాటు అర్థరాత్రి సమయంలో వచ్చిన క్షత గాత్రులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించారని అన్నారు. ఎక్కడా ఆలస్యం లేకుండా పోలీసులు,వైద్యులు ఎంతో బాధ్యతాయుతంగా మెదిలారని వారికి అభినందనలు తెలిపారు.  ప్రమాదంలో 15 మందికి అత్యంత స్వల్పంగా,మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయని, మరో నలుగురికి ఫ్యాక్చర్స్ అయ్యాయని మంత్రి మీడియాకి వెల్లడించారు. ఫ్యాక్చర్ అయిన వారికి సర్జరీ చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. స్వల్ప గాయాలై కోలుకున్న 15 నుంచి 20 మందిని ఇవాళ,మరో 6 గురిని రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. మిగతా బాధితులు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డిశ్చార్జి అయిన వారిని వాళ్ల ఇండ్లకు క్షేమంగా చేర్చే బాధ్యత తమదే అని,సొంత ఖర్చులతో రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.