mt_logo

ప్రార్థనా మందిరాల్లోనే శాంతి నెలకొని ఉంది : సీఎం కేసీఆర్

  •  శాంతిని భక్తిభావనలు పంచే  ఆధ్మాత్మిక కేంద్రం: ‘బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ..సదన్ ’ 
  • ఆధ్యాత్మిక గ్రంధాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి సాహిత్యం తో కూడిన గ్రంథాలయా ఏర్పాటు
  • ఈ నెల 31 న పరిషత్ భవన ప్రారంభోత్సవం

హైదరాబాద్:  ప్రార్థనా మందిరాల్లోనే శాంతి నెలకొని వుంటుందని, దేవాలయాలు సర్వ జనులకు సాంత్వన చేకూర్చే  కమ్యునిటీ సెంటర్లు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.  పూజారులు, పండితోత్తములు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ, తమ వాక్కులు దీవెనలతో సర్వజనహితం కోరుకుంటూ శాంతియుత సమాజం కోసం పాటుపడుతున్నారని సీఎం కొనియాడారు.  సువిశాల స్థలంలో హైదరాబాద్ నడిబొడ్డున గోపనపల్లిలో నిర్మించిన ‘బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ..సదన్ ’ భావి తరాలకు శాంతిని భక్తిభావనలు పంచే  ఆధ్మాత్మిక కేంద్రంగా, అన్ని వర్గాలకు అందుబాటులో వుండే కమ్యునిటీ సెంటర్ గా కొనసాగుతుందని సీఎం ఆకాంక్షించారు. హైద్రాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన.. బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, ఈ నెల 31 వ తేదీన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణ పై ‘డా. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ‘‘ ఒకనాడు సమైక్య పాలనలో అలజడులు అంశాంతికి నెలవుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నేడు రాష్ట్ర  ప్రభుత్వ కృషి, దైవకృపతో ఎటు చూసిన పచ్చని పంట పొలాలు ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నది.  దేశంలో మరెక్కడా నిర్మించని విధంగా దేవాలయాల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్మాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్న దేవాలయాలు ప్రార్ధనా మందిరాలతో శాంతి నెలకొన్నది. ప్రజలకెప్పుడు కష్టమొచ్చినా అక్కడ వాలుకుంటూ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నరు.  అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలయిన బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నది. పూజారులు పేద బ్రాహ్మణ వర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నది.  ప్రభుత్వం అందించిన సహకారంతో… పూజారి వృత్తినే నమ్ముకున్న పేద బ్రాహ్మణ పిల్లలకు చక్కటి చదువు అందుతున్నది. వేదాలు చదువుతూ దైవకార్యంలో మునిగిన  తమను కూడా పట్టించుకునే ప్రభుత్వం వున్నదనే భరోసా అర్చకుల్లో పెరిగింది. పేద బ్రాహ్మణ వర్గానికి తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదు..’’ అని సీఎం అన్నారు.

ఈ నెల 31 నాడు జరగబోయే పరిషత్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా…చండీ యాగం సుదర్శన యగాలను నిర్వహించాలని బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డా. కేవీ రమణాచారికి సీఎం సూచించారు. ఈ  ప్రారంభోత్సవానికి… అన్ని రాష్ట్రాల నుంచి, ప్రముఖ పుణ్య క్షేత్ర నుంచి అర్చకులను, ద్వాదశ జ్యోతిర్లింగాలు సహా దేశవ్యాప్తంగా ఉన్న కంచి కామకోటి తదితర పీఠాధిపతులను, ప్రముఖ హిందూ మత పెద్దలను, అన్ని రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాల పెద్దలను, దేశవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సిఎం అన్నారు. వారి ప్రయాణానికి, బస కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఇందుకు సంబంధించి కార్యక్రమానికి కావాల్సిన నిధులను విడుదల చేయాల్సిందిగా ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.బ్రాహ్మణ పరిషత్ భవన్ రాష్ట్రంలో..దైవ భక్తిని పెంపొందించే దిశగా ఆధ్యాత్మిక గ్రంధాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి సాహిత్యం తో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సత్యనారాయణ వ్రతం వంటి దైవ కార్యాలకు సంబంధించిన, యజ్జ యాగాదులు క్రతువులకు సంబంధించిన అవగాహనను కల్పించే సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాలన్నారు.దైవ భక్తులయిన సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో పుస్తకాలను ప్రచురించాలని డాక్యుమెంటరీలను రూపొందించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. మొత్తంగా.. బ్రాహ్మణ పరిషత్ భవనం, భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తి కి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్ సెంటర్ గా కొనసాగాలని సీఎం అన్నారు.పరిషత్ భవనం ప్రారంభం నాటికి మొత్తం ఎంతమందిని ఆహ్వానించాలి ఇంకా అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి మరోసారి సమావేశమై  కార్యాచరణ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ రమణాచారిని ఆదేశించారు.

మల్లినాథసూరి సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు :

 సమైక్య పాలనలో విస్మరించబడిన తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవింప చేసుకోవాలని సీఎం తెలిపారు. కాలగర్భంలో విస్మరించబడిన మల్లినాథ సూరి’ వంటి  నాటి ప్రముఖ భాషా కవి పండిత మహనీయుల ఘన చరిత్రలను వెలికితీయాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో…మల్లినాథుని జన్మస్థలం, మెదక్ జిల్లా కొల్చారంలో.. కోలాచల మల్లినాథ సూరి సంస్కృత విశ్వవిద్యాలయం.. ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్  నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యల కోసం కార్యాచరణ ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ సమావేశం నుంచి ఫోన్ ద్వారా ఆదేశించారు.