mt_logo

సామాజిక పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలి: సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జీఓ 58, 59 అమలు, గృహలక్ష్మి, ఆసరా పింఛన్లు, సాంఘిక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ ఫామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి రాహుల్ బొజ్జా, రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ హనుమంత రావు, సెర్ప్ సీఈవో గౌతమ్ పోట్రు, పీసీసీఎఫ్ (హెచ్‌హెచ్) సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక పింఛన్లు మంజూరీపై నిత్యం సమీక్షిస్తున్నందున, పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలన్నారు. రైతు రుణ మాఫీకై ప్రభుత్వం రూ. 19,446 కేటాయించిందని, అతి తక్కువ సమయంలో ఈ రుణ మాఫీ ముమ్మరంగా కొనసాగుతోందన్నారు. రుణ మాఫీ పొందిన రైతులను వెంటనే కొత్తగా పంట రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ అంశంలో ఏర్పడే ఇబ్బందులను అధిగమించడానికి ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి పరిష్కరించాలని అన్నారు.

రాష్ట్రంలో రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని, అయినప్పటికీ ఈ ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నిరుపేదలకు లబ్ధి చేకూరే జీ.ఓ 58 క్రింద స్వీకరించిన దరఖాస్తులను వారం రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి పట్టాలను అందచేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5707 కొత్త గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేయడం జరిగిందని, వీటన్నింటి నిర్మాణాలను ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయిల్ పామ్ క్రింద నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.