
వరంగల్, జూన్ 17: వరంగల్ కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ లో యంగ్ వన్ కంపెనీ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి, చేనేత శాఖల మంత్రి కేటీఆర్. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 3శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ, ఇవ్వాళ 30శాతం అవార్డులు పొందుతున్నది. కేవలం 3 కంపెనీల (కిటెక్స్, గణేశా,యంగ్ వన్) ద్వారా 33 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, మరో 30 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇందులో 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే, కాగా 80 శాతం ఉద్యోగాలు మహిళలకు వచ్చేలా కృషి జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి దుస్తులు ఇక్కడ తయారీ అవుతాయి.మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్ బట్టలు ప్రపంచానికి ఎగుమతి కానున్నాయి. రైతన్నలకు లాభం జరిగే విధంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. 5 ఏళ్లుగా శ్రమిస్తున్నాం… పరీక్ష కాలం వచ్చినప్పుడు ప్రజలు మాకు సహకరించాలి. పరకాలలో చల్లా ధర్మారెడ్డి కి పోటీగా నిలవడానికి ప్రత్యర్థులు భయపడుతున్నారు. ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు. రౌడీ ఇజం, గూండాఇజం చేస్తా అంటే కుదరదు. అలాంటి వాళ్లకు సహకరించే కాలం చెల్లిందని అన్నారు.