mt_logo

డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం కోసం తబ్రీద్ సంస్థ తెలంగాణలో రూ.1600 కోట్ల పెట్టుబడి

  • తబ్రీద్ సంస్థ  ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది 
  • ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలకు కూలింగ్ మౌలిక వసతుల కల్పన చేపట్టనున్న సంస్థ

ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ (cooling utility player) తబ్రీద్‌ (Tabreed) తెలంగాణ రాష్ట్రంలో తన భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. తంబీద్ సంస్థ వాణిజ్య మరియు ఇతర రంగాల శీతలీకరణ కార్యక్రమాలకు పేరుగాంచింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగంగా చేపట్టే కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆయా పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన శీతలీకరణ మౌలిక వసతుల) నిర్మాణం కోసం దాదాపు 1600 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టి ఆయా పారిశ్రామిక పార్కులకు శీతలీకరణ వసతులను అందించనున్నది. సంస్థ హైదరాబాద్ ఫార్మాసిటీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక పార్కుల అవసరాల మేరకు ఈ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనున్నది.

ఈ మౌలిక వసతుల కల్పన వలన పారిశ్రామిక పార్కులకు అవసరమైన కూలింగ్ మరియు స్టోరేజ్ అవసరాలను తీర్చేందుకు అవకాశం కలుగుతుంది. ఈ మేరకు సంస్థ 1 లక్ష 25 వేల రిఫ్రిజిరేషన్ టన్నుల కూలింగ్ మౌలిక వసతులను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది. దీని వలన 24 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలు కలుగుతుంది. ఈ లక్ష్యం పూర్తయితే ఆసియా ఖండంలోనే జీవించేందుకు, పని చేసేందుకు అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవబోతున్నది. 

ఈ సంస్థతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ కూలింగ్ సొల్యూషన్స్ మౌలిక వసతుల వలన బహుముఖ ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ లక్ష్యాల మేరకు దాదాపు 6800 గిగావాట్ల కరెంటుతో పాటు 41,600 మెగా లీటర్ల నీటిని పారిశ్రామిక రంగంలో పొదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది.  దీంతోపాటు ఆరు పాయింట్ రెండు మిలియన్ టన్నుల కార్బన్  డయాక్సైడ్ ఉద్గారాలను అరికట్టేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఈ సంస్థతో కలిసి చేపడుతున్న ఈ మౌలిక వసతుల కల్పన వలన ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్న బల్క్ డ్రగ్ తయారీ కేంద్రాలకు స్వచ్ఛమైన హరితమైన పరిష్కారాలు లభించే అవకాశం ఏర్పడుతుంది. 

ఈ మేరకు తబ్రీద్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైబరాబాద్ వంటి కమర్షియల్ డిస్ట్రిక్ట్ (నిర్దేశిత వాణిజ్య ప్రాంతాలు) తో పాటు రానున్న ప్రాంతాలలోనూ 2 మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ ను తగ్గించేలా కార్బన్ డయాక్సైడ్ య ఉద్గారాలను తగ్గించేలా సుదీర్ఘకాలం పాటు ఈ కూలింగ్ పరిష్కారాలను అందించేలా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో సుదీర్ఘకాలంలో హైదరాబాద్ నగరంలో కాలుష్యం మరియు ఉష్ణోగ్రతలు తగ్గి అత్యుత్తమ నగరాలకు కావలసిన అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావాన్ని ఈ సందర్భంగా సంస్థ వ్యక్తం చేసింది. 

తబ్రీద్ సంస్థ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణ అధికారి) ఖలీద్ అల్ మర్జుకి ప్రతినిధి బృందం ఈరోజు మంత్రి కే. తారక రామారావు తో దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైదరాబాద్ ఫార్మాసిటీ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా కొనసాగుతున్న పారిశ్రామికీకరణ, వేగంగా విస్తరిస్తున్న వ్యాపార వాణిజ్య ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సస్టైనబుల్ భవిష్యత్తు కోసం ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.  కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ, ప్రస్తుత మరియు భవిష్యత్తు పరిస్థితులకు అనుగుణంగా స్థానిక పరిస్థితులకు అనుకూలంగా అమలు చేసేందుకు వీలైన డిస్టిక్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తక్కువ విద్యుత్ శక్తిని ఉపయోగించుకునే కూలింగ్ (cooling) పరిష్కారాలను, కూల్ రూఫ్ పాలసీ వంటి విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందుకు పోతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఈ అవగాహన ఒప్పందం తెలంగాణ రాష్ట్ర మాత్రమే కాకుండా భారత దేశ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సంస్థ చైర్మన్ ఖాలిద్ అబ్దుల్లా అల్ ఖుబాసి తెలిపారు. తమ సంస్థకు డిస్ట్రిక్ట్ కూలింగ్ రంగంలో ఉన్న అపారమైన అనుభవము సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగిస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య రహిత ఫార్మాసూటికల్ క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పారిశ్రామిక పార్కులు, వాణిజ్య ప్రాంతాలకు అవసరం అయినా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన తమ కూలింగ్ టెక్నాలజీలను అందిస్తామన్నారు.

పారిశ్రామిక మరియు వాణిజ్య రంగాలు కలిగించే కాలుష్యానికి ప్రధాన కారణం అవి వాడే కూలింగ్ టెక్నాలజీలు అని వాటి ద్వారానే భారీ ఎత్తున కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని అయితే ఈరోజు జరిగిన అవగాహన ఒప్పందం మేరకు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి కూలింగ్ పరిష్కారాలను తెలంగాణకు తీసుకురావడం ద్వారా నెట్ జీరో ఉదారాల విషయంలో తెలంగాణ తన లక్ష్యాన్ని అందుకుంటున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈరోజు తమ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ఇండియా హెడ్  అతుల్ బగాయ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పైన ప్రశంసలు కురిపించారు. COP28 ద్వారా అంతర్జాతీయ కూలింగ్ ప్లెడ్జ్ కార్యక్రమాన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం చేపట్టిందని ఇందులో భాగంగా ప్రపంచ దేశాలను అత్యుత్తమ కూలింగ్ విధానాల ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యం మేరకు పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. దిశగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.