mt_logo

సాయన్న లేని లోటు పూడ్చలేనిది: అసెంబ్లీలో సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్ 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల  రాష్ట్ర అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించి, ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. ఈ రోజు  ప్రారంభమైన వర్షాకాల సమావేశాల సందర్భంగా సంతాప ప్రతిపాదనలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘స్వర్గీయ సాయన్న గారు నాలుగు దశాబ్దాలుగా  రాజకీయాల్లో శాసన సభ్యునిగా అనేక హోదాల్లో పనిచేశారు. ఆయన వ్యక్తిగతంగా నాకు తెలిసిన వ్యక్తి. ఎటువంటి సందర్భంలోనైనా చిరునవ్వుతో , చాలా ఓపికతో అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి.ఆయన కంటోన్మెంట్ శాసన సభ్యునిగా  ఉండే టైంలో నేను సీఎంగా అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కంటోన్మెంట్ ను ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్ లో కలిపితే బాగుంటుందని, వీకర్ సెక్షన్స్ కోసం కాలనీ కట్టాలని కంటోన్మెంట్ ప్రజల కోసం తీవ్ర తపన పడి అనేక రిప్రజంటేషన్లు ఇచ్చేవారు. అనేక సందర్భాల్లో  చెప్పిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రికి చెప్పి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించినం.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ ను నగరపాలకవర్గంలో కలుపాలని ఒక నిర్ణయానికి వస్తున్నట్లు శుభవార్త అందింది. సాయన్న కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను.  సాయన్న నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ హైదరాబాద్ చేరుకుని ఇక్కడే సెటిలై చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి… వివాదాలు లేని రాజకీయ నాయకుల్లో సాయన్న గారు ఒకరు.  వారి కూతురు లాస్య నందిత రెండు పర్యాయాలు నగరంలో కార్పొరేటర్ గా ప్రజలకు సేవలు అందించడం జరిగింది. సాయన్న గారి కుటుంబం మా కుటుంబం . సాయన్న గారి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాం. సాయన్న గారి లేని లోటు తీర్చలేనిది’’ అంటూ ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సాయన్న గారి మృతికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని సభ ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నదని తెలిపారు. సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ స్పీకర్ ప్రకటన మేరకు సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.