mt_logo

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు తెలంగాణ పాలన రామ రాజ్యం : జైన మత పెద్దలు

హైదరాబాద్, మే22: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మతస్థుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. గంగా జమున తెహజీబ్ కు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో పలు ప్రాంతాలకు చెందిన విభిన్న మతాలు, సంస్కృతుల ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ తో జైన మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ మైనార్టీ హక్కులను గుర్తిస్తూ, తమకు మైనార్టీ కమిషన్ లో ప్రాతినిధ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు వారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా జైన మతస్థుల కోరిక మేరకు జైన భవన్ నిర్మాణానికి ఉప్పల్ భగాయత్ లో 2 ఎకరాల స్థలాన్ని సీఎం కేటాయించారు. దాంతోపాటు జైన మహావీర్ హాస్పటల్ ఛైర్మన్, మత పెద్దల విన్నపం మేరకు హైదరాబాద్ మాసబ్ ట్యాంకు ప్రాంతంలో దశాబ్దాల కాలంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి ఆదరణ పొందుతూ వైద్య సేవలందిస్తున్న మహావీర్ హాస్పటల్ నిర్మితమై ఉన్న ప్రభుత్వ లీజు స్థలాన్ని ఉచితంగా సీఎం కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్ణయాల పట్ల హర్షధ్వనాలతో జైన సమాజం ధన్యవాదాలు తెలిపింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారతదేశానికి నీరు, భూమి, వాతావరణం, సూర్యరశ్మి వంటి ప్రకృతి అందించిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో 75 ఏండ్లుగా దేశ పాలక వ్యవస్థ వైఫల్యం చెందిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశంలో లభ్యమవుతున్న ప్రకృతి వనరుల వివరాలను ఒక్కొక్కటిగా సీఎం కేసీఆర్ వారికి వివరించారు. వ్యవసాయాధారిత భారతదేశంలో కేంద్ర పాలకులకు దార్శనికత లేకపోవడమే రైతుల పాలిట శాపంగా మారిందని సిఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇవాళ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని, ప్రజలందరి సహకారంతో దేశవ్యాప్తంగా ఈ అభివృద్ధిని పరిచయం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు తెలంగాణ పాలన రామ రాజ్యం : జైన సమాజం

గత పాలకుల హయాంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతలను పటిష్టంగా కొనసాగిస్తూ, తెలంగాణ ను అభివృద్ధి పథాన నడిపిస్తున్న సిఎం కేసీఆర్ పాలన రామరాజ్యాన్ని తలపిస్తున్నదని జైన మత సమాజ పెద్దలు కీర్తించారు. పారిశ్రామికాభివృద్ధి, వ్యాపార వాణిజ్య రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ విషయం వ్యాపార వర్గాలైన తమ అనుభవంలోకి స్వయంగా వచ్చిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తో సమావేశంలో జైన మత పెద్దలు మాట్లాడుతూ “మరెవ్వరికీ సాధ్యం కాని ఇంతటి అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతతో మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పారిశ్రామిక రంగాలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్తు, తదితర మౌలిక వసతులను పటిష్టపరచడంతో నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది” అని జైన మతస్తుల ఐక్య సంఘం ‘శ్రీ జైన్ సేవా సంఘ్’ కమిటి మెంబర్లు, జైన మత ప్రముఖులు స్పష్టం చేశారు.