mt_logo

మూసీ నది ఒడ్డున నివాసం ఉంటున్న పేదలకు 10,000 డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్న ప్రభుత్వం

  • మూసీ నది అడ్డంకులు తొలగించేలా… మూసీలో దుర్బర పరిస్థితులలో  నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్న ప్రభుత్వం
  • అన్ని ప్రాథమిక సౌకర్యాలున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రాంతాల్లో మూసీ పేదలకు పునరావాసం 
  • సుమారు 10 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇందుకు ఉపయోగించుకోనున్న ప్రభుత్వం
  • మూసీ ఆక్రమణల తొలగింపు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయింపు కోసం ప్రభుత్వానికి నగర ఎమ్మెల్యేల ఏకగ్రీవ వినతి
  • మూసీ అడ్డంకులు తొలగిన తర్వాత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం
  • ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రాథమిక ప్లానింగ్ పూర్తి చేసిన ప్రభుత్వం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేల సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పై విస్తృతంగా చర్చించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. 

ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ఎస్.ఎన్. డీపీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని, గతంలో కురిసిన భారీ వర్షాలకు వరద చేరి మునిగిపోయిన అనేక ప్రాంతాలు, ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్.ఎన్. డీపీ కార్యక్రమం తో పాటు మూసీ నది ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలకు ప్రభుత్వానికి అండగా ఉంటామని ఎమ్మెల్యేలుగా ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 10 వేలకు పైగా ఇండ్లను మూసీ నది ఒడ్డున దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి, మూసీ పైన కబ్జాలను తొలగించేలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కోరారు. 

ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా స్వయంగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనపై ఎమ్మెల్యేలను అభినందించిన మంత్రి కేటీఆర్, ఈ మేరకు ప్రభుత్వం మూసి నదిని అడ్డుగా ఉన్న ఆక్రమణల నుంచి విముక్తం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వాడుకుంటుందని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుర్తించిన మూసీ నదిలో నివాసం ఉంటున్న పేద ప్రజలను, అక్కడి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తుందని తెలిపారు. 

అత్యంత పేదరికం వలన మూసీ నది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల రూపంలో గొప్ప ఉపశమనం కలుగుతుందన్నారు. దీంతోపాటు మూసీ నది వరద నివారణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు, భవిష్యత్తు ప్రణాళికలకు ఈ అక్రమణల బెడద కూడా తగ్గుతుందన్నారు. మూసీ వెంట వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించి, మూసిని బలోపేతం చేస్తామని తెలిపారు. మూసీ అడ్డంకులు తొలగిన తర్వాత మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ప్రాథమిక ప్లానింగ్  ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.

మూసీ వరద నుంచి పేద ప్రజలను, నగరాన్ని కాపాడే ఉదాత్తమైన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలే స్వయంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని తెలపడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కబ్జాలను అడ్డంకులను తొలగిస్తే భవిష్యత్తులో మూసీ పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం తగ్గుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎస్.ఎన్. డీపీ రెండో దశ కార్యక్రమానికి సంబంధించిన పనులను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వాన నీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. 

ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకు ఇల్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నచోటనే నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. 

హైదరాబాద్ నగరంలో గత పది సంవత్సరాలలో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలను తమకు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో తెలిపారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని సందర్భంగా మంచి కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.