mt_logo

కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది: మల్కాజ్‌గిరి కార్యకర్తలతో కేటీఆర్

మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్లు, సోషల్ మీడియా వారియర్స్‌తో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ఎందుకు ఓట్లు వేయాలని కొందరు అడుగుతున్నారు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి మీరు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి నేను తెలంగాణ తెస్తానని చెప్పారు.. అప్పుడు వైఎస్, చంద్రబాబు లాంటి నాయకులు వెటకారంగా మాట్లాడారు. 2004లో ఐదుగురు ఎంపీలతో తెలంగాణ కోసం కొట్లాడి వాళ్లే తెలంగాణ తెచ్చారు అని గుర్తు చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్‌కు డేంజర్ ఉంది.. 2014 లో కూడా హైదరాబాద్‌ను యూటీ చేయాలని ప్రయత్నం చేశారు. ఉమ్మడి రాజధానికి ఉన్న పదేళ్ల సమయం పూర్తికాగానే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు. హైదరాబాద్‌ను యూటీ చేయొద్దంటే గులాబీ జెండా ఖచ్చితంగా లోక్‌సభలో ఉండాలె అని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దీన్ని అడ్డుకునే శక్తి, సత్తా లేదు.. హైదరాబాద్‌పై పెత్తనం, కేసీఆర్‌కు ఈ ప్రాంతం మీద పట్టు లేకుండా చేసేందుకు కూడా ఈ ప్రయత్నం చేస్తారు. కంటోన్మెంట్‌లో ఇంచు భూమి కోసం మనల్ని చావగొట్టారు. సందు దొరికితే ఖచ్చితంగా హైదరాబాద్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు అని హెచ్చరించారు

బీజేపీ గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తారు.. బీజేపీ వాళ్లే డైరెక్ట్‌గా ఈ విషయాన్ని చెబుతున్నారు.. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర కూడా చేస్తున్నారు.. బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులో ఓట్ల కోసం గోదావరి నది నుంచి నీళ్లు ఇచ్చే కుట్ర చేస్తున్నారు. నదుల అనుసంధానం పేరుతో తెలంగాణ అవసరాలు తీరకుండానే నీటి మళ్లించే దగా చేస్తున్నారు.. 2026లో జరిగే డిలిమిటేషన్‌ను జనాభా ప్రతిపాదికగా చేసి దక్షిణ భారతదేశానికి అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారు..వీటన్నింటిని అడ్డుకొని గల్లా పట్టి నిలదీయాలంటే ఖచ్చితంగా లోక్‌సభలో గులాబీ కండువా ఉండాలె అని కేటీఆర్ తెలిపారు.

పదేళ్లలో బీఆర్ఎస్ ఎంపీలు 4,754 ప్రశ్నలు అడిగారు.. కాంగ్రెస్, బీజేపీలు అసలు రాష్ట్రం కోసం ప్రశ్నలు అడగలె.. బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు.. ఒక్కడు కూడా ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా ప్రశ్నించలే..తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ మీద విషం చిమ్మిన మోడీని ప్రశ్నించే దమ్ము లేదు అని దుయ్యబట్టారు.

మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి పని కూడా చేయలే.. హైదరాబాద్‌లో మేము 36 ఫ్లై ఓవర్లు కడితే.. కేంద్రానికి కనీసం రెండు ఫ్లై ఓవర్లు కట్టటం చేతనైతలేదు. కిషన్ రెడ్డి గారు కరోనా సమయంలో కుర్‌కురే ప్యాకెట్లు పంచిండు.. బీజేపోళ్లు పెద్ద ఫేకుడు గాళ్లు.. కరోనా వ్యాక్సిన్‌ను మోడీయే కనిపెట్టిండని కిషన్ రెడ్డి చెప్తాడు.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏమో మీరు బతికి ఉండటానికి కారణం మోడీయే అంటారు.. ఇంకో బీజేపీ నాయకుడు రష్యా-ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపిండని అంటాడు అని విమర్శించారు.

ఈ దేశంలో అసలు మధ్య తరగతి నడ్డి విరిచిందే నరేంద్రమోడీ ప్రభుత్వం.. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గినప్పటికి మన దగ్గర మాత్రం పెట్రోల్, డిజీల్ ధరలు పెంచిండు. పెట్రోల్, డిజీల్ ధరల పెంచటం కారణంగా పప్పు, ఉప్పు, చింతపండు ఇలా అన్ని ధరలు పెరిగినయ్.. ఈయన ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని మాత్రమే..పెట్రోల్, డిజీల్ మీద రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు..ఈ పైసలతో జాతీయ రహదారులు కట్టినా అంటాడు.. మరి టోల్ ఎందుకు వసూల్ చేస్తున్నావంటే చెప్పడు.. మన ముక్కుపిండి వసూలు చేసిన రూ. 30 లక్షల కోట్లలో రూ. 14 లక్షల కోట్లు అదానీ, అంబానీలకు రుణమాఫీ చేసిండు అని ధ్వజమెత్తారు.

నేను చెప్పిందని తప్పని ఈటల రాజేందర్ గారు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి ఈ రాష్ట్రంలో చోటు లేదని గతంలో ఈటల రాజేందర్ చెప్పిన విషయం గుర్తు తెచ్చుకోవాలె..మోడీ రాకముందు వరకు తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సులు మాత్రమే తెలుసని కిషన్ రెడ్డి అంటడు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పమంటే వాళ్లకు చెప్పకోవటానికి ఒక్క అంశం లేదు. అందుకే జై శ్రీరామ్ పేరుతో రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. మనం కూడా జై శ్రీరాం, జై తెలంగాణ, జై భారత్ అందాం అని అన్నారు.

రాముడు కూడా రాజధర్మం పాటించమని చెప్పాడు.. కానీ బీజేపీ రాజధర్మం పాటిస్తుందా? వివక్ష చూపుతూ పనిచేస్తున్న బీజేపీని రాముడు కూడా హర్షించడు.. మనం కూడా యాదగిరి గుట్ట కట్టినం.. కానీ దేవుని పేరు మీద రాజకీయాలు చేయలే అని తెలిపారు.

రూ. 15 లక్షలు, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ రైలు, ప్రతి ఒక్కరి ఇళ్లు, ధరల నియంత్రణ, రూపాయి విలువ బలోపేతం, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ చేస్తా అని మోడీ హామీ ఇచ్చాడు.. మోడీ గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలే.. అయినా సరే దేవుడి పేరుతో ఓటు వేయాలని వాళ్లు కోరుతున్నారు. మతం పేరుతో విషం నింపే ఈ బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండాలె అని సూచించారు.

హైదరాబాద్ ప్రశాంతంగా మత సామరస్యంతో ఉండాలంటే మనం బీజేపీని పక్కన పెట్టాలె.. యూట్యూబే మన కొంపముంచింది.. తప్పుడు ప్రచారం కారణంగా నష్టం జరిగింది. యూట్యూబ్‌లో ధ్రువ్ రాఠీ అనే యువకుడు బీజేపీ బట్టలు ఊడదీస్తున్నాడు.. అదే విధంగా సోషల్ మీడియాలో ప్రతి వారియర్ బీజేపీ బండారం బయటపెట్టాలి అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నాలుగు నెలల పాలన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పిచ్చి పిచ్చి తిట్లు తిడుతున్నారు.. మీరు 10-12 సీట్లు ఇస్తే చాలు.. మళ్లీ రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ శాసించే పరిస్థితి వస్తది. మైనార్టీలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలె.. రేవంత్ రెడ్డి చాలా పార్టీలు మారిండు.. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలోకి మారతాడు అని జోస్యం చెప్పారు.

రాహుల్ గాంధీ ఏమో చౌకిదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ హమారా బడే భాయ్ అంటాడు.. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అంటే రేవంత్ రెడ్డి అదానీ నా ఫ్రెండ్ అంటాడు..రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటాడు.. రేవంత్ రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ చేస్తా అంటాడు.. రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కాం ఏం లేదంటాడు.. కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమని అంటాడు.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్టే అంటాడు. ఆప్ కీ అదాలత్ అనే ప్రొగ్రామ్‌కు వెళ్లి మోడీకి ఓటు వేయమంటాడు అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

బీజేపీని 2014, 2019లో అడ్డుకున్నది బీఆర్ఎస్ మాత్రమే.. బండి సంజయ్, ఈటల, రఘునందన్ రావు, సోయం బాపు రావులను ఓడించిందెవరు? బీజేపోళ్లు మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, బీఆర్ఎస్ ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నం చేశారు.. కానీ అది సాధ్యం కాలేదు. కానీ కాంగ్రెస్ ఎక్కడైతే ఉందో అదే రాష్ట్రాల్లో బీజేపీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది అని గుర్తు చేశారు.

ప్రత్యర్థులు మన మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వారియర్స్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు.. పదేళ్లలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో సిస్టమేటిక్‌గా మనల్ని బద్నాం చేసిన కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా సాగింది.. మనం పూర్తి స్థాయిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టకపోవటంతో కొంత నష్టం జరిగింది అని అన్నారు.

కాంగ్రెస్‌కు మనకు తేడా 1.8 ఓట్లు మాత్రమే.. 14 నియోజకవర్గాల్లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయాం.. హైదరాబాద్‌లో మనం మంచి ఫలితాలు సాధించాం.. జిల్లాల్లో మాత్రం సాధించలేకపోయినం. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తక్కువ అవుతది.. ఈ సారి ప్రతి ఓటు కీలకమని సోషల్ మీడియా వారియర్స్ ప్రచారం చేయాలె. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో మనం ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం.. 3 లక్షల 55 వేల మెజార్టీ తెచ్చుకున్నాం అని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని చేసుకున్నాయి.. కావాలనే బీజేపీని గెలిపించేందుకు మల్కాజ్‌గిరిలో డమ్మీ అభ్యర్థిని పెట్టారు.. చేవెళ్ల సీటు కోసం సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఆమెను మల్కాజ్‌గిరిలో పోటీలో పెట్టారు.. కాంగ్రెస్‌కు వచ్చే ఓట్లను ఈసారి బీజేపీకి ట్రాన్ఫర్ చేసే విధంగా రెండు పార్టీలు పనిచేస్తున్నాయి అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బండి సంజయ్ స్పష్టంగా చెప్పారు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేసి కాంగ్రెస్.. మైనార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకుందని ధర్మపురి అర్వింద్ అన్నారు. మేము మేము ఒక్కటే.. లోక్‌‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి మా పార్టీలో చేరతాడని కూడా ఆయన అన్నాడు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లించారు.. పరస్పర అవగాహనలో భాగంగా ఒకరి ఓట్లు ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని విమర్శ చేశారు.

గుడ్డి వ్యతిరేకతతో కేసీఆర్‌ను ఓడించాలని బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలని వాళ్లు కలిసి పనిచేస్తున్నారు.. పోయినసారి మల్కాజ్‌గిరిలో జరిగిన తప్పు మళ్లీ ఈ సారి జరగకూడదు.. 5 వేల ఓట్లతోనే ఓడిపోయాం.. మన చిన్న మిస్టేక్ కారణంగా మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి గెలిచి సీఎం పదవి వరకు వచ్చాడు అని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్‌ను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది.. మల్కాజ్‌గిరి నియోజకవర్గం రేవంత్ రెడ్డికి అన్ని ఇచ్చింది.. కానీ మల్కాజ్‌గిరికి ఏం చేసిండు? అరచేతిలో వైకుంఠం చూపి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అని దుయ్యబట్టారు.

కంటోన్మెంట్‌లో నివేదితను, మల్కాజ్‌గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించేందుకు అంతా కష్టపడి పనిచేయాలి అని కేటీఆర్ కోరారు.