mt_logo

10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ శిథిలం అయిందని సీఎం, డిప్యూటీ సీఎం అంటున్నారు. కేసీఆర్ ఎంతో శ్రమించి గురుకుల వ్యవస్థను తీసుకువచ్చారు అని గుర్తు చేశారు.

డిప్యూటీ సీఎం భట్టికి గురుకుల విద్యా వ్యవస్థపై అవగాహన లేదు. సీఎం, డిప్యూటీ సీఎం ఎప్పుడైనా గురుకులాల వద్దకు వెళ్ళారా. గురుకులాల్లో ప్రతి పాఠశాలకు ఒక జీవో ఉంటుంది. ఇప్పుడున్న ఉన్న గురుకులాల్లో అన్ని సామాజికవర్గాల విద్యార్థులు ఉన్నారు. మీరు తీసుకువచ్చిన సామాజిక న్యాయం ఏంటో ప్రజలకు చెప్పాలి అని అడిగారు.

పది లక్షల మంది విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను బంద్ చేస్తారా. ఒక్కో విద్యార్థిపై కేసీఆర్ లక్ష రూపాయలు ఖర్చు చేశారు. మండలాల్లో ఉన్న గురుకులాలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 662 గురుకులాలకు బడ్జెట్ ఇవ్వండి. భట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో అందరికి ఒకే హాస్టల్, డైనింగ్ లేదు. స్కూల్స్ కోళ్ల ఫామ్స్ కాదు.. ఒకే చోట 2,560 మంది విద్యార్థులు ఎట్లా వుంటారు అని ప్రశ్నించారు.

60 మంది విద్యార్థులకు కేసీఆర్ పది ఎకరాల స్థలం కేటాయించారు. 2,560 మందికి 25 కోట్లతో భవనాలు ఎట్లా కడతారు. రాష్ట్రంలో సంక్షేమ శాఖలు అన్ని రద్దు చేస్తారా?.కేసీఆర్ జీవో నంబర్ 55 తీసుకువచ్చి అన్ని వర్గాలకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించారు అని తెలిపారు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జీవో నంబర్ 29 తెచ్చారు.. సీఎం, డిప్యూటీ సీఎం అబద్ధాల ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో విద్యార్థులు విమానాలు ఎక్కారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే 28 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారు. ట్రిపుల్ ఐటీ బాసరలో 8,000 మంది విద్యార్థులు ఉంటే ఇబ్బందులు పడుతున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

గురుకులాల్లో చదివిన వారికి 160 మందికి మెడికల్ సీట్లు వచ్చాయి. విద్యార్థులు తమకు ఫ్యాకల్టీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకులాల్లో పని చేస్తున్న టీచర్లను ఒకే రోజు రెండు వేల
మందిని తీసేశారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాలపై జీవో లేకుండా భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ఇస్తారు అని దుయ్యబట్టారు.

ఇప్పటి వరకు ఒక్క గురుకుల పాఠశాలకు రగ్గులు ఇవ్వలేదు.. గురుకులాల్లో పని చేస్తున్న స్టాఫ్‌కు జీతాలు సరిగా రావడం లేదు. ఆరు గ్యారెంటీల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌పై అఖిలపక్షం పెట్టండి అని డిమాండ్ చేశారు.